మాజీ రంజీ ఆటగాడు సురేష్ కుమార్ ఆత్మహత్య
బెంగళూరు: కేరళకు చెందిన మాజీ క్రికెటర్ ఎం సురేష్ కుమార్(47) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. అలప్పుజలోని తన ఇంటిలోనే సురేష్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేరళలోని అలప్పుజకు చెందిన ఈ ఆటగాడ్ని సహచరులు ఉంబ్రిగా పిలిచేవారు. ఇతడు ఎడమ చేతివాటం స్పిన్ బౌలర్. భారత్ తరపున 1990లో అండర్-19 జట్టులో ఆడాడు.
కేరళ నుంచి భారత్ తరపున ఆడిన తొలి ఆటగాడు సురేష్ కుమారే కావడం గమనార్హం. రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలోని అండర్ 19 జట్టులో ఇతడు ఆడాడు. 1995-96లో రాజస్థాన్ జట్టుతో జరిగిన రంజీ మ్యాచులో కేరళ జట్టు తరపున ఆడిన సురేష్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లు తీసి సత్తా చాటాడు.
1994-95లో తొలి రంజీ ట్రోఫీ కేరళ గెలిచింది. ఈ టోర్నీని గెలవడంలో సురేష్ కుమార్ కీలక భూమిక పోషించారు. తమిళనాడు జట్టుపై కేరళ గెలిచింది. 164 పరుగులిచ్చిన సురేష్ కుమార్ 12 వికెట్లు తీశాడు.
2005లో రంజీకి వీడ్కోలు పలికాడు. పాలక్కడ్లో జార్ఖండ్ జట్టుతో జరిగిన మ్యాచులో చివరిసారిగా ఆడాడు. రిటైర్మెంట్ అనంతరం ఇండియన్ రైల్వేస్లో పనిచేశాడు. 72 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన సురేష్.. 196 వికెట్లు తీశాడు. 51 లిస్ట్ ఏ మ్యాచుల్లో 52 వికెట్లు తీశాడు.