చిన్నారి రెండు రూపాయలు తీసిందని .. కర్రు కాల్చి వాత పెట్టిన ఓ తల్లి రాక్షసత్వం
చిన్నారులు తెలిసో తెలియకో తప్పు చేస్తే వారికి అర్థమయ్యేలా చెప్పి తప్పు దిద్దాల్సిన ఓ తల్లి క్రూరంగా ప్రవర్తించింది. రెండు రూపాయలు తీసుకున్న కారణంతో పదేళ్ల కూతురిపై రాక్షసిలా ప్రవర్తించింది. ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగిన ఈ ఘటనలో తల్లి తన కుమార్తెకు నరకం చూపించింది. కర్రు కాల్చి వాత పెట్టి చిన్నారిని చిత్రహింసలకు గురిచేసింది.
ఎవరైనా తన బిడ్డకు చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోతారు. అలాంటి తల్లి తన అమ్మతనాన్ని మరచి తన శాడిజాన్ని బిడ్డ మీద చూపించింది . ఖమ్మం జిల్లా కారేపల్లి లో ఓ తల్లి మాతృత్వానికి మచ్చ తెచ్చింది. పేరుపల్లికి చెందిన ఓ మహిళ తన పదేళ్ల కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. కేవలం రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కర్రు కాల్చి వాతపెట్టింది. నొప్పికి తాళలేక చిన్నారి ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు పరిగెత్తుకు రావడంతో విషయం బయటకు పొక్కింది.
రెండు రూపాయలు తీసుకుందన్న కోపంతో కట్టెల పొయ్యిలో మండుతున్న కట్టెను తీసి తీసి విచక్షణా రహితంగా అరచేతిపైనా, ఒంటిపైనా వాతలుపెట్టింది.తల్లి పెట్టిన వాతలకు తాళలేక చిన్నారి అరుస్తూ ఏడుస్తూ ఉంటే చిన్నారి అరుపులు విని ఇంట్లోకి వెళ్లిన చుట్టుపక్కల వాళ్లు తల్లి రాక్షసత్వాన్ని చూసి నివ్వెరపోయారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిని ఇంకేం చేస్తుందో అన్న అనుమానంతో ఆమె నుంచి ఆ బాలికను విడిపించే ప్రయత్నం చేశారు. దీంతో వారిపైనా ఆ మహిళ అంతెత్తున లేచి ఆగ్రహం వ్యక్తం చేసింది.
రెండు రోజుల క్రితం కూడా పారతో తన ముఖంపై కొడితే పళ్లు ఊడొచ్చాయని బాలిక చెబుతుంటే చుట్టుపక్కలవారు చలించిపోయారు. తల్లి తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తల్లి పెట్టే చిత్రహింసలు తాళలేక చిన్నారి పడుతున్న నరకయాతన చూసి చలించిన స్థానికులు బాలికను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఐసీడీఎస్ సీడీపీవో దయామణి, అంగన్వాడీ సెక్టార్ పర్యవేక్షకురాలు పుష్పావతిలు సోమవారం బాధిత బాలిక ఇంటికి వెళ్లి విచారణ జరిపి బాలిక శరీరంపై గాయాలు చూసి వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు. బాలికను ఖమ్మంలోని బాల సదన్ లో ఉంచనున్నారు. ఇక స్థానిక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.