భద్రాద్రి రాముడికి ఆంధ్రా భక్తుడి భారీ కానుకలు
ఖమ్మం : ఉమ్మడి రాష్ట్రం నుంచి చెరో దిక్కు విడిపోయినా.. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు కనిపించడం లేదు. పాలకులకే రాజకీయాలు గానీ తమకు అలాంటివేవీ పట్టవని నిరూపిస్తున్నారు. ఆ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు చాలాసార్లు రుజువయ్యాయి. ఇక భక్తి విషయంలో రెండు ప్రాంతాల మధ్య సరిహద్దులంటూ ఏవీ లేవు. అలాంటి నేపథ్యంలో కృష్ణా జిల్లా బాపులపాడుకు చెందిన యార్లగడ్డ వెంకటేశ్వర రావు అనే భక్తుడు భద్రాద్రి రాముడికి భారీ కానుకలు సమర్పించారు.
అన్నదానం కోసం 6 లక్షల రూపాయలు, గోశాల నిర్వహణకు మరో 6 లక్షలు, సత్రం గది నిర్మాణానికి 8 లక్షలు... ఇలా మొత్తం 20 లక్షల రూపాయల నగదు అందించారు. దీంతో వెంకటేశ్వరరావును ఆలయ అధికారులు అభినందించారు. ఆలయ మర్యాదల ప్రకారం స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించారు. రాములోరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని దీవించారు.