గర్భిణీపై దాడి...! అంగన్వాడీ ఆయాపై వేటు
ఖమ్మం : గర్భిణీపై అమానుషంగా దాడి చేసిన అంగన్వాడీ ఆయాపై వేటు పడింది. టేకులపల్లి మండలం మద్దిరాల తండాలో జరిగిన ఘటనపై ఐసీడీఎస్ పీడీ ఝూన్సీలక్ష్మీబాయి విచారణ జరిపారు. ఈమేరకు అంగన్వాడీ ఆయా నీలావతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
అంగన్వాడీ సెంటర్లో తన కూతురును దూరంగా కూర్చోబెట్టారనే విషయంపై ఆయాను.. పద్మ అనే మహిళ నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లుగా విచారణలో తేలింది. అయితే గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెపై ఆయా అమానుషంగా ప్రవర్తించారని అధికారులు తప్పు పట్టారు. ఆమె భర్త వీరూ సైతం విచక్షణరహితంగా ప్రవర్తించారని తేల్చారు. ఈమేరకు ఆయనపై 320, 316 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
అంగన్వాడీ ఆయా తీరును గ్రామస్థులంతా ముక్తకంఠంతో ఖండించారు. అధికారులు విచారణకు వచ్చిన సందర్భంలో పద్మకు సపోర్టుగా నిలిచారు. అదలావుంటే తీవ్రగాయాలతో మనోవేధనకు గురైన పద్మకు ఆరోగ్యం కుదుటపడేవరకు చికిత్స అందిస్తామని తెలిపారు ఐసీడీఎస్ అధికారులు.