భద్రాద్రి రామయ్య ఆలయ పూజారికి కరోనా.. మొన్న అయోధ్య పూజారికి కూడా..
కరోనా ఎవరినీ వదలడం లేదు. స్వామివార్లను పూజించే అయ్యవార్లను కూడా విడిచిపెట్టడం లేదు. ఇటీవలే అయోధ్య భూమి పూజ చేసే పూజారికి కరోనా వచ్చింది. శిష్యుడు ప్రదీప్ దాస్కి వైరస్ సోకగా.. గురువు సత్యేంద్ర దాస్ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. భూమిపూజకు దూరంగా ఉండిపోయారు. అయితే ఇప్పుడు తెలంగాణలో గల అయోధ్య భద్రాద్రి ఆలయ పూజారికి కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో ఆందోళన నెలకొంది.
భద్రాచలం శ్రీరాముడి ఆలయంలో పనిచేస్తున్న అర్చకుడికి కరోనా వైరస్ వచ్చింది. దీంతో మిగతా వారు కూడా ఆందోళన చెందుతున్నారు. అతనితో సన్నిహితంగా ఉన్నవారికి వైద్య పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఇదివరకు కూడా ఆలయంలో పనిచేసే ఒకరికీ కరోనా సోకింది. అర్చకుడితో ఆ సంఖ్య రెండుకి చేరింది. మిగిలిన సిబ్బంది, అర్చకులు అందరికీ ముందు జాగ్రత్త చర్యగా పరీక్ష చేయిస్తామని వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగూడెం, పాల్వంచలో మాత్రం ఎక్కువగా కేసులు వస్తున్నాయి. శుక్రవారం భద్రాది జిల్లాలో కొత్తగా 79 కరోనా కేసులను గుర్తించారు. గత వారం రోజుల్లో జిల్లాలో 335 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వచ్చి జిల్లాకు చెందిన వైద్యాధికారి డాక్టర్ జీ నరేశ్ కుమార్ శుక్రవారం చనిపోయారు. ఆయన మణుగూరు క్వారంటైన్ సైంటర్ ఇంఛార్జిగా వ్యవహరించేవారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తోన్న ఫ్రంట్ లైన్ వారియర్ల మృతి ఆందోళన కలిగిస్తోంది.