ఏప్రిల్ 14న భద్రాద్రి రామయ్య కళ్యాణం.. 6 నుండి 20 వరకు సంబరాలు
లోకకళ్యాణార్థం నిర్వహించే భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవాన్ని ఏప్రిల్ 14 వ తేదీన నిర్వహించడానికి ముహూర్తం ఖరారైంది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే కళ్యాణోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా సాగుతుంది. పావన క్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6 నుండి 20వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు భద్రాద్రి దేవాదాయ శాఖ అధికారులు.
ఏప్రిల్ 6న ఉగాది వేడుకల తో ప్రారంభించి 20వ తేదీ వరకు జరగనున్న పలు కార్యక్రమాలను, స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాల విశేషాలను వెల్లడించారు భద్రాద్రి దేవాలయ కార్యనిర్వహణాధికారి రమేష్ బాబు. ఏప్రిల్ 10న అంకురార్పణ , 11న గరుడ పట లేఖనం, 12న అగ్ని ప్రతిష్ట, 13న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 14న వేదమూర్తుల మంత్రోచ్చారణల నడుమ ,ప్రభుత్వ లాంచనాలతో ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించి స్వామీ వారి కళ్యాణాన్ని చాలా కమనీయంగా జరిపిస్తారు.
అనంతరం స్వామి వారిని చంద్రప్రభ వాహనంపై తిరు వీధుల్లో ఊరేగిస్తారు. 15వ తేదీన మహా పట్టాభిషేకం సందర్భంగా స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. 16న సదస్యం పేరిట మహాదాశీర్వచన కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు. 20వ తేదీన చక్ర తీర్థ క్రతువు తో స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలు వస్తాయి. భద్రాద్రి కొలువైన శ్రీ సీతారామ స్వామి వారి శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ తయారుచేసిన ప్రణాళికలను అధికారులు తెలంగాణా ప్రభుత్వానికి పంపించారు. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సీతా రామ స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కమనీయం, రమణీయం.