మరో ఎన్నికల వ్యూహ రచనలో బండి సంజయ్ ... ఖమ్మంపై కమలనాధుల ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఊహించని విధంగా పుంజుకున్న బీజేపీ తెలంగాణా రాష్ట్రంపై దండయాత్ర మొదలు పెట్టింది. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ సేన దూకుడుగా ముందుకు వెళ్తుంది . దుబ్బాకలో సాధించిన విజయాన్ని అలాగే కొనసాగిస్తూ బీజేపీ గ్రేటర్ లో 48 స్థానాలను చేజిక్కించుకుని సత్తా చాటింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బిజెపినే ఉందని బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపింది.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ... టీఆర్ఎస్ కు చెంప పెట్టు .. బండి సంజయ్ ధీమాతో పాటే అనుమానాలు కూడా ..
ఇదే సమయంలో రానున్న ఎన్నికలపై కూడా బీజేపీ దృష్టి పెట్టింది.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ నజర్
ప్రధానంగా త్వరలో ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పుడు బీజేపీ ఖమ్మంలో పాగా వెయ్యటానికి ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. 2021 కొత్త సంవత్సరంలో కూడా బిజెపి తన దూకుడును కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఏడాది ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కార్పొరేషన్ ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఇప్పటి నుంచి స్థానిక సమస్యలపై పనిచేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఇదే సమయంలో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలు, అసంతృప్తులను ఆకర్షించే పనిలో బిజెపి ఉంది.
ఆపరేషన్ ఆకర్ష్.. ఇతర పార్టీల అసంత్రుప్తులపై ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగామని చెప్పుకుంటున్న బిజెపి ఈ జోష్ ను ఇలాగే కొనసాగించాలని , వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రాబోయే ఖమ్మం ఎన్నికల్లో కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలలో చూపించిన దూకుడునే చూపించాలని భావిస్తోంది. ఇప్పటికే ఇతర పార్టీలలో ఉన్న అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మార్చి వరకు ఖమ్మం కార్పొరేషన్ పదవీకాలం ఉన్న నేపథ్యంలో, ప్రస్తుతం ఈ రెండు మూడు నెలల కాలం ఖమ్మం కార్పొరేషన్ పై గట్టిగా ఫోకస్ పెట్టనుంది.
గతంలో ఒక్క చోట కూడా గెలవని బీజేపీ .. కానీ ఈసారి సత్తా చాటాలని నిర్ణయం
గతంలో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో బిజెపి ఒక్క స్థానం కూడా దక్కించుకో లేదు. అంతేకాదు 11 చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట మాత్రమే డిపాజిట్ దక్కించుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి నేతలు రంగంలోకి దిగారు. ఈసారి స్థానిక సమస్యలతో పాటుగా ఆకర్ష మంత్రాన్ని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ తర్వాత జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంటే, స్థానిక సమస్యలపై ఉద్యమాలకు దిగుతూ అధికార పార్టీలో అసంతృప్తులను, కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు తమవైపు ఆకర్షించే పనిలో పడింది బిజెపి.
కాంగ్రెస్ నేతల చూపు బీజేపీ వైపు .. ఖమ్మంలో ఇప్పటి నుండే బీజేపీ వ్యూహరచన
బండి సంజయ్ కూడా ఇప్పటికే పలు సమస్యలపై ఖమ్మంలో బీజేపీ గొంతును వినిపించారు . కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు తీవ్రంగా దెబ్బతింటున్న నేపథ్యంలో చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వారిని పార్టీలోకి ఆహ్వానించి, ఖమ్మం కార్పొరేషన్లో పాగా వేయాలని బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేదని అందరూ భావిస్తున్న తరుణంలో ఊహించని విధంగా బిజెపి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో బీజేపీ ఇదే ఊపును ప్రదర్శిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన రాజకీయ శక్తిగా అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టడం ఖాయం.