పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట చావు డప్పు: ఖమ్మంలో పెళ్లికూతురుతో సహా ముగ్గురు ఆత్మహత్య
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరగాల్సిన ఓ ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా ఆవేదనకు గురి చేసింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా చావు డప్పు మోగింది. పెళ్లి కూడా చెయ్యలేని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబంలో ఏకంగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా విషాదంగా మారింది.
రేపు పెళ్లి .. అంతలోనే పెల్లికూతురితో పాటు తల్లి , చెల్లి ఆత్మహత్య
వివరాల్లోకి వెళితే ఖమ్మం నగరంలోని రాఘవ థియేటర్ ప్రాంతంలో ప్రకాష్ అనే వ్యక్తి భార్య , ఇద్దరు కూతుళ్లతో నివాసముంటున్నారు. ప్రకాష్ బంగారం షాపులో పని చేస్తుంటారు. తల్లి, ఇద్దరు కూతుళ్లు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో కుమార్తె వివాహం నిశ్చయం కాగా, జనవరి 11వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. కరోనా టైం నుండి వారికి పెద్దగా పని లేకపోవటంతో కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది .
కట్నం లేకుండా పెళ్లి .. అయినా పెళ్లి ఖర్చులకు కూడా డబ్బు లేని పేదరికం
కట్నం లేకుండా ప్రకాష్ కుమార్తె రాధికను వివాహం చేసుకోవడానికి వరుడు సిద్ధం కాగా , పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు ప్రకాష్ కుటుంబ సభ్యులు. అక్కడ ఇక్కడ అప్పు కోసం ప్రయత్నం చేసినా ఎక్కడా డబ్బు పుట్టకపోవడంతో, వివాహ సమయం దగ్గర పడుతున్న కారణంగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. దీంతో పెళ్లి కూడా చేసుకోలేని తమ ఆర్థిక పరిస్థితికి తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడాలని భావించారు .
Recommended Video
బంగారం మెరుగు పెట్టె రసాయనం తాగి తల్లి ఇద్దరు కూతుళ్ళు మృతి
బుధవారం రాత్రి బంగారం మెరుగు పెట్టె రసాయనం తాగి ప్రకాష్ భార్య గోవిందమ్మ, కూతుళ్లు రాధిక, రమ్య లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం షాప్ లో పనిచేసే ప్రకాష్ రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో అందరూ మరణించారు. దీంతో ప్రకాష్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమ ఆర్థిక పరిస్థితులే భార్య పిల్లలు చనిపోవడానికి కారణమని కన్నీటి పర్యంతమయ్యాడు. ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రేపు పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చావు డప్పు మోగింది.