ఫారెస్ట్ సిబ్బంది వస్తే కొట్టండి.. మరో ప్రజాప్రతినిధి నిర్వాకం.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు షాక్..
కొత్తగూడెం : కాగజ్ నగర్ సార్సలా ఘటన మరువకముందే.. కొత్తగూడెంలో మరో వివాదం వెలుగు చూసింది. అక్కడ ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోతే.. ఇక్కడ మాత్రం సాక్షాత్తు ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఫారెస్ట్ అధికారులను బెదిరిస్తూ విధి నిర్వహణకు ఆటంకం కల్పించారనే అభియోగంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
అటవీ భూముల వివాదం.. అడ్డంగా బుక్కైన వనమా
అటవీ భూముల వివాదంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బుక్కయ్యారు. లోతువాగు 2వ బీట్ కంపార్టుమెంట్ పరిధిలోని చాతకొండ లక్ష్మిదేవిపల్లి మండలం, ఇల్లందు క్రాస్ రోడ్స్ టూరిజం హోటల్ దగ్గర అటవీశాఖ రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీ లైన్ ఉంది. దాంతో అక్కడ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టారు అటవీశాఖ అధికారులు. అయితే 29వ తేదీ శనివారం నాడు ఎమ్మెల్యే అనుచరుడిగా చలామణి అవుతున్న మాజీ ఎంపీటీసీ పూనం శ్రీను.. దాదాపు 80 మంది గ్రామస్తులను వెంటబెట్టుకుని వచ్చి అక్కడ జరుగుతున్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ పనులు నిలిపివేయించాడు.
ఎవరైతే ఆ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్నారో సదరు కాంట్రాక్టర్ను బెదిరించారు. పనులు నిలిపివేయకుంటే బాగుండదని హెచ్చరించారు. దాంతో ఆయన ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే సిబ్బందిని వెంటబెట్టుకుని కొత్తగూడెం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంఆర్పీ రావు.. పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.
తమ్ముడి కోసం అన్న పాకులాట.. గిట్లనే చెప్పాలే.. గ్రామస్తులకు ఎమ్మెల్యే కోనప్ప క్లాస్ (వీడియో)
ఎమ్మెల్యే తీరుతో అధికారులు పరేషాన్..!
ఫారెస్ట్ రిజర్వు ప్రాంతంలోని ఏరియాలో అడవులను సంరక్షించే ప్రయత్నంలో ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తుంటే.. మాజీ ఎంపీటీసీ కొందర్ని వెంటబెట్టుకుని వచ్చి రాద్దాంతం చేశారని ఆరోపించారు ఎంఆర్పీ రావు. ఎందుకు పనులు నిలిపివేయించారంటూ నిలదీస్తే సదరు భూములకు పట్టాలున్నాయని వాదించారు. అయితే అట్టి భూములు ఫారెస్ట్ రిజర్వు పరిధిలో ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు.
ఒకవేళ మీకు హక్కులుంటే వాటికి సంబంధించిన పత్రాలు, ఆధారాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారిని కలవమని సూచించారు. దాంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నట్లు.. ఆ క్రమంలోనే పనులను అడ్డుకున్నామని వారు సదరు అధికారిపై చిర్రుబుర్రులాడారు.
ఎమ్మెల్యే దగ్గరుండి.. అధికారులకు ఆటంకం
అదలావుంటే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ భోజనానికి వెళ్లిన సమయంలో స్వయంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కొడుకు వనమా రాఘవ వచ్చి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అప్పటికే అక్కడ తవ్విన గుంతలను దగ్గరుండి గ్రామస్తులతో పూడ్చివేయించారు. ఇకపై ఎవరైనా ఫారెస్ట్ అధికారులు వస్తే తన్ని తరిమికొట్టాలని వారిని రెచ్చగొట్టారు. అయితే ప్రొటెక్షన్ వాల్ కోసం తవ్విన గుంతలను పూడ్చివేయడంతో అటవీశాఖకు దాదాపు 50 వేల రూపాయల నష్టం వాటిల్లింది.
భోజనానికి వెళ్లి తిరిగొచ్చిన డీఆర్వో.. పూడ్చిన గుంతలు చూసి షాక్ అయ్యారు. అంతలోనే ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరించారు. అక్కడ ఎవరు ఉండొద్దని, అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని హుకుం జారీ చేశారు. ఒకవేళ కాదు కూడదని పనులు చేయిస్తే మీ సంగతి చూస్తానంటూ బెదిరించారు.
పోలీసులకు ఫిర్యాదు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
ఎమ్మెల్యే, అతడి అనుచరుల తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించారు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్. శనివారం నాడు జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఫారెస్ట్ స్థలంలోకి చొరబడటమే గాకుండా విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి ఆటంకాలు కలిగించారని కంప్లైంట్లో పేర్కొన్నారు. అంతేగాకుండా అటవీశాఖకు నష్టం చేకూరేలా ప్రయత్నించారని ఆరోపించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన వెంట ఉన్న అనుచరులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఆ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.