తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్: ఇద్దరు మావోయిస్టులు మృతి
ఖమ్మం: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో సోమవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 6న బంద్ పేరుతో మావోయిస్టులు దాడులకు కుట్ర పన్నారని తెలిపారు. దీంతో చర్ల అటవీ ప్రాంతంలో బలగాలను అప్రమత్తం చేసి మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ చేపట్టామని చెప్పారు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పూసుగుప్పలో పోలీసులు-మావోయిస్టుల మధ్య సుమారు 30 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు ఎస్పీ ధృవీకరించారు.
ఘటనా స్థలంలో ఎస్బీబీఎల్ తుపాకీ, పిస్టల్, రెండు కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతానికి వెళ్లిన ఎస్పీ సునీల్ దత్.. కాల్పులు జరిగిన ప్రదేశంలో తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Recommended Video
ఇటీవల భద్రాద్రి జిల్లా గుండాల మండలం దేవల గూడెం వద్ద ఎదురుకాల్పుల్లో శంకర్ అనే మావోయిస్టు మృతి చెందాడు. శంకర్ ఎన్కౌంటర్కు నిరసనగా ఆదివారం భద్రాద్రి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, భూపాలపల్లి, ములులు జిల్లాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. అంతేగాక, ఆదివారం రాత్రి చర్ల సమీపంలోని తిప్పాపురం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మందు పాత్ర పేల్చి శంకర్ పేరుతో ఉన్న కరపత్రాన్ని వదిలివెళ్లారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా మారాయి.