దొంగల్లో వీడు వేరయా.. పొద్దంతా లేబర్ పని.. రాత్రైతే ఇళ్లల్లో దూరుడే..!
భద్రాచలం : దొంగలు రూట్ మార్చుతున్నారు. నమ్మకంగా జనాల మధ్యనే ఉంటూ వీలుచిక్కినప్పుడు చోరీలకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో తాజాగా పోలీసులకు పట్టుబడ ఘరానా దొంగ తీరు విస్మయం కలిగిస్తోంది. చోరీలు చేసేవారు సాధారణంగా కష్టపడటానికి ఇష్టపడరు. చోరీ సొమ్ముతో ఎంజాయ్ చేయడానికే మొగ్గు చూపుతారు. కానీ వీడు మాత్రం పొద్దంతా కాయకష్టం చేస్తున్న బిల్డప్ ఇచ్చాడు. వాడి పనేదో వాడు చేసుకుంటున్నాడనే రీతిలో అందర్నీ నమ్మించాడు. పొద్దుగూకితే మాత్రం తనలోని చోరకళను నిద్ర లేపుతున్నాడు.
దొంగతనాలకు ఒకసారి అలవాటుపడ్డోడు పదేపదే చోరీలనే ఎంచుకుంటాడు. తాజాగా భద్రాచలం పోలీసులకు దొరికిన శివకిశోర్ కూడా అదే కోవలోకి వస్తాడు. గతంలో ఇతర రాష్ట్రంలో దొంగతనాలు చేసి జైలుశిక్ష అనుభవించాడు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోరీలు చేస్తూ రెచ్చిపోయాడు. చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.
పగలేమో కూలీ.. రాత్రైతే దొంగ
శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన శివకిశోర్ దొంగతనాల్లో ఆరితేరాడు. రాత్రి సమయాల్లో ఇళ్లల్లో చొరబడుతూ అందినకాడికి ఎత్తుకెళ్లేవాడు. ఇదివరకు ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో చోరీలు చేయడంతో అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. దాంతో అతడు చేసిన దొంగతనాల తాలూకు జైలు శిక్ష అనుభవించాడు. అయితే స్థానిక పోలీసుల దృష్టి తనపైనే ఉండటంతో అక్కడి నుంచి జంప్ అయ్యాడు.
సీన్ కట్ చేస్తే.. దంతెవాడ నుంచి భద్రాచలంకు షిఫ్ట్ అయ్యాడు. అద్దె ఇంటిలో నివాసముంటూ రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. పొద్దంతా కూలీ పనులు చేస్తూ వాడి కష్టమేదో వాడు పడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు.
ఎండాకాలం బీరు తిప్పలు.. సల్లగా తాగుదామంటే నో స్టాక్ బోర్డులు..!
చోరీల్లో దిట్ట.. తెలుగు రాష్ట్రాల్లో 16 దొంగతనాలు
పగలు కూలి పనులు చేస్తూ.. రాత్రి సమయాల్లో చోరీలు చేయడంలో శివ కిశోర్ ఆరితేరాడు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా చూసుకున్నాడు. అయితే తప్పు చేసినోడు ఎప్పటికైనా చట్టం నుంచి తప్పించుకోలేడు కదా. అతడి విషయంలో అదే జరిగింది. గురువారం నాడు భద్రాచలం ఆర్టీసీ బస్స్టాండ్ ఏరియాలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అడ్డంగా దొరికిపోయాడు శివ కిశోర్.
పోలీసులను చూడగానే బిత్తర చూపులు చూస్తున్న శివ కిశోర్ పై వారికి అనుమానం వచ్చింది. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా ఘరానా దొంగ గుట్టురట్టైంది. ఛత్తీస్ గఢ్ నుంచి భద్రాచలం చేరుకున్నాక తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాడని పోలీసులు చెబుతున్నారు. శివ కిశోర్ చోరీల చిట్టా గురించి ఏఎస్పీ రాజేశ్ చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 16 దొంగతనాలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు చెప్పారు.
అడ్డంగా బుక్కయ్యాడు.. ఊచలు లెక్కిస్తున్నాడు
ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ దొంగతనాలకు పాల్పడ్డ శివ కిశోర్ ఆటకట్టించారు భద్రాచలం పోలీసులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, సుజాత నగర్, లక్ష్మిదేవి పల్లి, దుమ్ముగూడెం, చర్ల, ఖమ్మం తదితర ప్రాంతాల్లో శివ కిశోర్ దొంగతనాలు చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. గతంలో కాకినాడ, విశాఖపట్నం, ఆముదాలవలస, విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.
నిందితుడి నుంచి 95 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, 20 కిలోల సిల్వర్తో పాటు అలంకరణ సామాగ్రి, కిలోల కొద్దీ పూజా సామాగ్రి లభ్యమైందని తెలిపారు. శివ కిశోర్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించింది.