వారసత్వ ఉద్యోగాలు లేవు.. "అన్ఫిట్" అడ్డదారులు.. సింగరేణి కేసులో ఒకరు అరెస్ట్
హైదరాబాద్ : సింగరేణిలో కారుణ్య నియామకాలు అవకతవకలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయా? కారుణ్యం స్థానంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయా? సంస్థ ఉద్యోగాల్లో తమకు హక్కున్నా.. దళారుల కారణంగా ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇలాంటి లెక్కలేనన్ని ప్రశ్నలకు పాలకుల నిర్ణయాలే సమాధానంగా కనిపిస్తాయి. కారుణ్య నియామకాలు కొందరికి కంఠశోషగా మారుతున్న వేళ.. 'అన్ఫిట్' అనే ఒకే ఒక్క పదంతో "అన్ లిమిటెడ్"గా సంపాదిస్తున్న దళారీ దగాకోరులకు కాసుల వర్షం కురుస్తోంది.
కారుణ్యం జాడేది?.. అంతా అక్రమమే..!
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్ పడింది. కారుణ్య నియామకాలు మాత్రం కొనసాగుతున్నాయి. అదే దళారులకు వరంగా మారింది. సింగరేణి ఉద్యోగిగా కుటుంబ యజమాని అచేతనావస్థలో (అన్ఫిట్) ఉండి.. ఆ ఉద్యోగం చేయలేనప్పుడు, కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశం లభిస్తుంది. దీంతో కొడుకో, కూతురో ఉద్యోగంలో చేరితే ఆ కుటుంబానికి ఆసరా దొరుకుతుంది. అయితే కారుణ్య నియామకాలను అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకునే దళారీగాళ్ల అక్రమాలకు అంతులేకుండా పోతోంది. ఇది బహిరంగ రహస్యమే అయినా.. ఎవరూ పట్టించుకోని పరిస్థితి.
పైసలిస్తేనే పని..!
కారుణ్య నియామకాల కింద దరఖాస్తు చేసుకున్నవారి ఫైళ్లు మూలుగుతున్నాయి. ఏళ్ల తరబడి అధికారుల దగ్గర పెండింగులో ఉంటున్నాయి. అన్నీ రకాలుగా అర్హత ఉండి కావాల్సిన పత్రాలన్నీ సమర్పించినా కూడా.. అవి అలాగే పక్కన పడి ఉంటాయి. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు ముడుపులు చెల్లిస్తే గానీ పని జరగని పరిస్థితి. అదలావుంటే అన్ఫిట్ కార్యక్రమం మొదలు నుంచి.. మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేంతవరకు మొత్తం చూసుకుంటామని చెప్పే దళారులు ఉంటారు. దానికోసం ప్యాకేజీలు మాట్లాడేస్తారు. ఇంతిస్తే మీ పని అతి త్వరగా చేసిపెడతానంటూ లెక్కల చిట్టా విప్పుతారు. వారు అడిగింది ఇస్తే పని సులువుగా, సాఫీగా జరిగిపోతుంది.
నేనే ఇప్పించా..! అడ్డంగా దొరికిన అధికారి
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు లేకపోవడంతో.. కారుణ్య నియామక అస్త్రాన్ని వాడుకుంటున్నారు దళారులు. కాసుల కక్కుర్తే ధ్యేయంగా కొందరు ఉద్యోగులను అన్ఫిట్ కింద దరఖాస్తు చేయిస్తున్నారు. అదలావుంటే కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత్యోద్యోగిపై అలాంటి ఆరోపణలు రావడం ప్రకంపనలు సృష్టించింది. 2018, జూన్ నెలలో అల్లి ప్రకాశ్ రావు అనే ఉద్యోగి అన్ఫిట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆ క్రమంలో ఆయన వారసుడికి సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగం వచ్చింది. అయితే అది తనవల్లే వచ్చిందంటూ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి.కె.సంపత్ కుమార్.
దీంతో విసిగివేసారిపోయిన ప్రకాశ్ రావు సింగరేణి యాజమాన్యానికి, ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో సంపత్ కుమార్ ను డిసెంబర్ లో విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. అదలావుంటే బుధవారం (06.02.2019) నాడు ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. కొత్తగూడెంలోని సంపత్ కుమార్ నివాసంతో పాటు ఆయన సోదరుడి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.