భద్రాద్రి ఈవో రమేష్ బాబుపై వరకట్న వేధింపుల కేసు.. రమేష్ బాబుతో ప్రాణహాని ఉందన్న కోడలు
భద్రాది దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదయింది. రమేష్ బాబు అతని కుటుంబ సభ్యులు పెళ్లైన వారం రోజుల నుండి తనను వేధింపులకు గురిచేస్తున్నారని, అదనపు కట్నం కోసం హింసిస్తున్నారని రమేష్ బాబు కోడలు సింధూర సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రమేష్ బాబు మానసిక వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి చెప్పకుండా వివాహం చేశారని, అప్పటి నుంచి భర్తతో, అత్తమామలతో, ఆడపడుచుతో నరకం చూస్తున్నానని సింధూర కన్నీటి పర్యంతమైంది. రమేష్ బాబు కుటుంబంతో ప్రాణహాని ఉందని పేర్కొంది.
భద్రాద్రి దేవస్థాన ఈవో రమేష్ బాబు కుమారుడు అనంత్ నాగ్ కు గత ఏడాది ఏప్రిల్ 19న సత్తుపల్లి కి చెందిన సింధూర ను ఇచ్చి వివాహం జరిపించారు.అనంత నాగ్ కు ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం ఉంది అని, బాగా చదువుకున్నాడు అని చెప్పి ఒత్తిడి తెచ్చి మరీ పెళ్లి చేసిన రమేష్ బాబు కుటుంబం పెళ్లయిన వారం రోజుల నుండే తనను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు కోడలు సింధూర. మానసిక జబ్బు తో బాధపడుతున్న తన భర్త కూకట్ పల్లి లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పగలంతా మందులు వేసుకొని పడుకుని ,రాత్రిళ్లు మద్యం సేవించి రోడ్లపై తిరుగుతారని సింధూర ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అకారణంగా తనను కొట్టేవాడని, ఈ విషయాలను బయట పెట్టకుండా మామ రమేష్ బాబు తన పలుకుబడితో అడ్డుకునే వాడని ఆమె ఆరోపించింది.
రమేష్ బాబు కుటుంబం పెడుతున్న చిత్ర హింసలు భరించలేక గతంలో కేటీఆర్ ను కలిసే ప్రయత్నం కూడా చేశానని, మామ రమేష్ బాబు రాజకీయ పలుకుబడితో తనను, కేటీఆర్ కు కలవకుండా అడ్డుకున్నారని సింధూర ఆరోపించారు. ఈవో రమేష్ బాబు వల్ల తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీస్ స్టేషన్లో సింధూర చేసిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.