25 రైతుల 36 లక్షలు ఇవ్వండి.. వ్యాపారులకు ఎమ్మెల్యే హరిప్రియ స్పష్టీకరణ
పంట కొనుగోలు చేసి, రైతుల కళ్లల్లో కారం కొట్టొద్దని ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన బినామీ కమీషన్ వ్యాపారులు, మార్కెట్ అధికారులతో ఆమె చర్చలు జరిపారు. ఇల్లందు మండలం 9వ మైలు తండా, కారేపల్లి మండలం సూర్యాతండా, గిద్దవారి గూడెం, మధిరకు చెందిన సుమారు 25 మంది మిర్చి రైతులకు రావాల్సిన సుమారు రూ.36 లక్షలను ఇవ్వాలని ఆదేశించారు.
మార్కెట్లలో బినామీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకూ ఎక్కువయ్యాయని వారిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారిపై పీడీ యాక్టు తరహాలో కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక లైసెన్స్ కలిగన కమీషన్ వ్యాపారిపై ఐదు నుంచి పది మంది వరకు బినామీలుగా వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. తమకు అసలు లైసెన్స్ ఉన్న వ్యాపారి ఎవరో తెలియక ఇలాంటి మాయగాళ్ళ ఉచ్చులో పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు పండించే తమను మోసం చేసే వారిని కఠినంగా శిక్షించాలని రైతులు డిమాండ్ చేశారు.
బినామీ వ్యాపారులు బావ్సింగ్, అతడి గుమ్మస్తా గురు మెదట 9వ మైలు తండా రైతులకు మాత్రమే నగదు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో, సూర్యాతండా రైతులకు నగదు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి మార్కెట్లోనే ప్రాణాలొదులుతామని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ కల్పించుకొని అందరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
తర్వాత బినామీ వ్యాపారులు రైతులకు ఇవ్వాల్సిన మొత్తం రూ. 36 లక్షలకు గాను రూ. 26 లక్షలు మత్రామే నగదు తీసుకు రావడంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఆ నగదును స్వాదీనం చేసుకున్నారు. మిగితా రూ.10 లక్షలు శనివారం ఇస్తానని బినామీ వ్యాపారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరిసింగ్, ఖమ్మం మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, సెక్రటరీ రుధ్రాక్షి మల్లేశం, త్రీటౌన్ సీఐ శ్రీధర్, అడ్తీ వ్యాపారుల సంఘం (దిగుమతి) అధ్యక్షుడు దిరిశాల వెంకటేశ్వర్లు, కార్యదర్శి బజ్జూరి రమణారెడ్డి ఉన్నారు.