ప్రామిస్.. నాకేం తెలియదు: ఆనంద్ రెడ్డి హత్యపై ప్రదీప్ రెడ్డి సోదరుడు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఆనంద్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ రెడ్డి సోదరుడే ప్రశాంత్ రెడ్డి. ఈయన హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆనంద్ హత్యలో ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని కూడా ఊహాగానాలు వినిపించాయి. దీంతో సీఐ ప్రశాంత్ రెడ్డి స్పందించారు.
ఆనంద్ రెడ్డి స్నేహితుడే హంతకుడు, వాటా డబ్బులు అడిగినందుకే ఘాతుకం, ప్రదీప్ రెడ్డి సహా ఆరుగురు కలిసి..
ఏ పాపం తెలియదు..
అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆనంద్ రెడ్డి హత్యతో తనకు సంబంధం లేదని ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. తనపై వస్తోన్న ఆరోపణలు కలిచివేశాయని ఒక ఆడియో టేపును కూడా విడుదల చేశారు. తన 24 ఏళ్ల సర్వీసులో ఏ చిన్న తప్పు కూడా చేయలేదని స్పష్టంచేశారు. కానీ ఆనంద్ రెడ్డి హత్య కేసులో తన పేరు రావడం బాధ కలిగించిందని చెప్పారు.
సోదరుడి సలహా మేరకే..
ప్రశాంత్ రెడ్డి వెర్షన్ ఇలా ఉంటే.. ఆనంద్ రెడ్డిని హత్య చేసే సమయంలో సోదరుడి సలహాను ప్రదీప్ తీసుకున్నారని తెలుస్తోంది. ఆనంద్ హత్యకు ముందు, ఆ తర్వాత కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. తన సోదరుడు హత్య చేయబోతున్నారని తెలిసినా.. పోలీసులను ప్రశాంత్ రెడ్డి ఎందుకు అలర్ట్ చేయలేదనే అనుమానం కలుగుతోంది. అయితే ప్రశాంత్ రెడ్డి పాత్రపై కూడా సందేహాం కలిగిన వరంగల్ పోలీసులు.. ఇప్పటికే ఒకసారి విచారించారు. తమకు అందుబాటులో ఉండాలని కూడా సూచించంతో మరింత అనుమానం కలుగుతోంది. ఈ క్రమంలోనే ఆనంద్ హత్య కేసులో తనకు సంబంధం లేదని ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
ఏం జరిగిందంటే..
జనగామ జిల్లా ఓబుల్ కేశవాపూర్కు చెందిన మోకు ఆనంద్ రెడ్డి (45).. ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇతనికి తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లి ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు. వరంగల్ అర్బన్ జిల్లా శనిగరానికి చెందిన ప్రదీప్ రెడ్డితో స్నేహం ఏర్పడింది. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఇసుక వ్యాపారంలో ఇద్దరు రూ.80 నుంచి రూ.90 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇసుక వ్యాపారంలో ఆనంద్ రెడ్డి తన వాటా కంటే అధికంగా డబ్బులు పెట్టారు, ఎక్కువ పెట్టిన నగదు ఇవ్వమని ప్రదీప్ రెడ్డిపై ఆనంద్ రెడ్డి ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో వీరి మధ్య వైరం ప్రారంభమైంది.
నగదు ఇస్తానని చెప్పి
డబ్బులు ఇస్తానని ప్రదీప్ రెడ్డి వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో ఈ నెల 7వ తేదీన హన్మకొండలోని హోటల్లో పెద్దల సమక్షంలో కూడా మాట్లాడుకున్నారు. నగదు సంబంధించి డబ్బులు, కొంత భూమి ఇస్తానని ప్రదీప్ వారితో చెప్పాడు. ఆ రోజు ఉదయం 9 గంలకు భూపాలపల్లికి ఆనంద్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి సహా మరికొందరు వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్నాక.. భూమి, డబ్బుల గురించి డిస్కస్ చేద్దామని చెప్పి రాంపూర్ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మట్టుబెట్టాడు.