గొర్రెల పేరుతో దివాళా పిటిషన్.. అప్పు ఇచ్చినోళ్లకు అంతే సంగతి..!
ఖమ్మం : అధిక వడ్డీలు జనాలను నిలువునా ముంచుతున్నాయి. చారానా కోడికి బారానా మసాలా లాగా తయారవుతోంది పరిస్థితి. తీసుకున్న అసలు కొంచెమైతే.. కట్టే వడ్డీలు మాత్రం తడిసిమోపెడవుతున్నాయి. వ్యాపారం చేసి అప్పులు తీర్చేయొచ్చు అనుకుంటూ చాలామంది తెలిసినవారి దగ్గర అధిక వడ్డీలకు డబ్బులు తీసుకుంటూ ఇబ్బందుల పాలవుతున్నారు. అదే క్రమంలో ఒకతను గొర్రెలను పెంచడానికి అందినకాడికి అప్పులు జేసి ఇప్పుడు దివాళా పిటిషన్ పెట్టిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.
ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం గ్రామస్తుడు పేరం వెంకట రమణ గొర్రెలు కొని పెంచుతున్నాడు. వాటిని అలా పెంచుతూ కొంతకాలం తర్వాత అమ్మితే లాభాలు వస్తాయని ఆశించాడు. అలా బంధుమిత్రుల దగ్గర అప్పుసప్పు జేసి మరీ గొర్రెలు కొన్నాడు. అయితే కొన్ని రోజులకు ఆ గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దాంతో అతడికి ఏమి చేయాలో తోచలేదు. అలా అప్పుల బాధతో చివరకు కోర్టును ఆశ్రయించాడు.
ఇస్మార్ట్ కొడుకు.. అయ్య ఫోనులో గేమ్స్ ఆడుతూ.. రాసలీలల బాగోతం బయటేశాడుగా..!
గొర్రెలు చనిపోయాయనే విషయం తెలిసి అప్పు ఇచ్చినోళ్లు వెంకట రమణపై వత్తిడి పెంచారట. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ పట్టుబట్టడంతో చివరకు ఐపీ (INSOLVANCY PETITION) పెట్టాడు. ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 12 లక్షల 80 వేల రూపాయలకు దివాళా పిటిషన్ దాఖలు చేశాడు.
ఫిర్యాదుదారు తరపున మొత్తం పదహారు మందిని ప్రతివాదులుగా చూపించి న్యాయవాదులు బీశ రమేశ్, జి.వీరభద్రం ఐపీ పిటిషన్ పెట్టారు. అయితే గొర్రెల పేరుతో అప్పుజేసి ఇలా ఐపీ పెట్టడం ఖమ్మం జిల్లాలో చర్చానీయాంశమైంది.