అబ్బబ్బో ఎన్ని పాటలో.. ఖమ్మం ఉద్యోగుల డ్యాన్స్లో..!
ఖమ్మం : టిక్కుటాక్కుల గోల సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాటకో, డైలాగుకో అభినయం ప్రదర్శిస్తూ రూపొందిస్తున్న టిక్టాక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఆ క్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు చేసిన టిక్కుటాక్కు వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. విధినిర్వహణలో పనిపాటా లేకుండా వీడియోలు తీయడంలో మునిగిపోయిన సిబ్బందిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ఉద్యోగులను ఇతర డిపార్టుమెంటుకు బదిలీ చేస్తూ చర్యలు తీసుకున్నారు. అయితే ఆ సిబ్బందికి పనిపాటా లేదన్నట్లుగా ఎన్ని వీడియోలు తీశారో తెలిస్తే షాక్ అవడం ఖాయం.
టిక్కుటాక్కు సరదా.. అంటిస్తోంది బురద..!
బాధ్యతతో మెలగాల్సిన ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది టిక్టాక్ వీడియోలతో కాలం గడిపేశారు. పనిపాటను పక్కన పడేసి వీడియోలు తీసుకోవడం కోసమే ఆఫీసుకు వచ్చామన్నట్లుగా వ్యవహరించారు. లెక్కకు మించి వీడియోలు తీసి విధి నిర్వహణలో వారు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారో కళ్లకు కట్టినట్లైంది. సినిమా పాటలకు తోడు కొన్ని డైలాగులకు వారు చేసిన అభినయం చివరకు వారి ఉద్యోగాలకు ఎసరు తెచ్చేలా చేసింది. కానీ ఉన్నతాధికారులు దయతలచి కేవలం శాఖాపరమైన మార్పులతో సరిపెట్టారు. లేదంటే ఈపాటికి ఇంట్లో కూర్చునేవారు.
లవ్
జర్నీ..
ముంబై
టు
ఆదిలాబాద్..
ప్రియుడి
ఇంటి
ఎదుట
ధర్నా..!
(వీడియో)
అబ్బబ్బో ఎన్ని పాటలో..!
ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది కొందరు రూపొందించిన టిక్టాక్ వీడియోలు దుమారం రేపాయి. ఆ క్రమంలో వారు రూపొందించిన పలు వీడియోలు బయటపడ్డాయి. కొన్ని సినిమా పాటలు, కొన్ని డైలాగులతో రూపొందించిన సదరు వీడియోలు బయటకు పొక్కడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నాగార్జున నటించిన స్నేహమంటే ఇదేరా చిత్రంలోని "నా పెదవికి నవ్వులు నేర్పావు.. ప్రియా నీకు జోహార్" అనే పాటకు అభినయం చేస్తూ ఓ వీడియో తీసి టిక్టాక్ యాప్లో అప్లోడ్ చేశారు. అలాగే చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని "చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరుసలు కలవగా.. ముసిరిన కసికసి వయసులో" అంటూ సాగే పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో తన నటనాకౌశల్యం ప్రదర్శించారు ఓ ఉద్యోగి.
వామ్మో.. వీళ్ల సరదా పాడుగానూ..!
అలాగే ఆకాశ్ హీరోగా, షమితా శెట్టి హీరోయిన్గా నటించిన పిలిస్తే పలుకుతా సినిమాలోని "మనసా ఒట్టు మాటాడొద్దు.. పెదవి గడప దాటి నీవు బయటపడొద్దు.. వెచ్చని ముద్దు వెతికా గుర్తు" అనే పాటపై వీడియో చిత్రీకరించి అప్లోడ్ చేశారు. ఇక డైరెక్టర్ ఈవీవీ తనయుడు రాజేశ్, శ్రియ జంటగా నటించిన సొంతం సినిమాలోని "అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది.. పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది.. కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకో.. ఇంతవరకు లేదుగా ఇప్పుడు ఏమైందో" అంటూ వయ్యారాలు పోతూ చిత్రీకరించిన వీడియో కూడా వైరల్గా మారింది.
అదలావుంటే "ఎందరో మహానుభావులు కొందరికే వందనములు" అంటూ అక్కడి సీనియర్ ఉద్యోగులను కాకా పట్టే రీతిలో చిత్రీకరించిన మరో వీడియో కూడా బాగా వైరలయింది. ఇక "సారీ" స్పెల్లింగ్ చెప్పండబ్బా అంటూ ఓ సీనియర్ అడిగితే అక్కడి సిబ్బంది ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ తెలియదన్నట్లుగా యాక్టింగ్ చేశారు. అందులో ఒకరు సారీ అనుకుంటూ వెళ్లిపోతారు. ఇలాంటి పనికిమాలిన వీడియోలు తీసి విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వచ్చాయి.