మరో రెవెన్యూ లొల్లి.. డబ్బులు గుంజి పట్టాలు ఇవ్వలేదు..! వీఆర్వో నిర్భందం..!!
ఖమ్మం : డబ్బులు తీసుకుని కూడా పాసు పుస్తకాలు ఇవ్వలేదంటూ రైతులు ఆందోళకు దిగారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం చలానా తీయాలంటూ పెద్దమొత్తంలో వసూళ్లు చేశారని ఆరోపించారు. తల్లాడ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శుక్రవారం నాడు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రసన్న, శ్రీనివాస్ ఇక్కడ పనిచేసే సమయంలో వివిధ గ్రామాలకు చెందిన రైతుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేశారని ఆరోపించారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో రైతుల పేర్లు నమోదు చేసేందుకు, 1బీ ఖాతాలో పేరు చేర్చేందుకు ఎకరానికి 5 వేల నుంచి 25 వేల రూపాయల వరకు చలానా పేరుతో వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అలా గత మూడేళ్లలో లక్షలాది రూపాయలు వసూలు చేసి పాసు పుస్తకాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఆ ఇద్దరు ఇతర ప్రాంతానికి బదిలీ కావడంతో తమ భూములు ఎవరు ఆన్లైన్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
షిరిడీ సాయితో డైరెక్టు కాంటాక్ట్.. మీ పాపాలు తొలగిస్తా.. లేడీ బాబా కొంపముంచిందిగా..!
రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బదిలీ కావడం.. రైతులు ఆందోళన చేయడం.. విషయం కాస్తా మిగతా గ్రామాలకు పాకడంతో పెద్దఎత్తున రైతులు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నారు. మల్లారం, మిట్టపల్లి, గోపాలపేట, బాలపేట, నూతన్కల్ తదితర గ్రామాలకు చెందిన అన్నదాతలు నిరసన పర్వంలో గళం కలిపారు.
తహసీల్దార్ కార్యాలయంలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ సదరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గానీ, ఎమ్మార్వో గానీ రాకపోవడంతో వారిలో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. దాంతో అదే సమయానికి అన్నారుగూడెం వీఆర్వో నాగేశ్వరరావు కార్యాలయం పని నిమిత్తం అక్కడకు చేరుకున్నారు. దాంతో ఆయనను ఓ గదిలో వేసి నిర్బందించారు. ఆ క్రమంలో ఎమ్మార్వోకు రైతులు ఫోన్ చేశారు. అయితే తాను ఓ మీటింగ్ నిమిత్తం ఖమ్మం వచ్చానని.. తిరిగి వచ్చాక సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దాంతో రైతులు అక్కడినుంచి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇద్దరు ఆర్ఐ లతో పాటు వీఆర్వోపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇది సివిల్ మ్యాటరని.. ఆర్డీవోతో పాటు కలెక్టర్కు కంప్లైంట్ చేయొచ్చనే పోలీసుల సూచన మేరకు కల్లూరు ఆర్డీవో శివాజికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.