వన్ ఇండియా ఎఫెక్ట్ : సీఎం దగ్గరకు వెళ్లొద్దు.. సాయం చేస్తామంటూ రైతు పాదయాత్రను ఆపిన అధికారులు
ఖమ్మం : సింగరేణి సంస్థ వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఓ రైతు కుటుంబం సీఎం కేసీఆర్ను కలిసేందుకు ఈనెల 18వ తేదీన హైదరాబాద్ బయల్దేరింది. ఆ క్రమంలో ఆ కుటుంబ వేదనను "వన్ ఇండియా తెలుగు" వీడియోతో సహా వార్తను పబ్లిష్ చేసింది. దాంతో జిల్లా అధికారులు కదిలారు. వారిని మధ్యలోనే ఆపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ను కలవడానికి హైదరాబాద్ వెళ్లకుండా నిలువరించారు.
ఇల్లెందు పట్టణం నుంచి హైదరాబాద్ వెళుతున్న రైతు కుటుంబానికి 'సీఎం దర్శనభాగ్యం కలిగేనా' అంటూ "వన్ ఇండియా తెలుగు" ఆ వార్తను హైలైట్ చేసింది. రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు, అధికారులంటూ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది. అయితే ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దిగొచ్చారు.
సింగరేణితో అన్యాయం.. సీఎం కేసీఆర్ను కలిసేలా పాదయాత్ర..!
సింగరేణి సంస్థ వల్ల భిక్షాటన స్థితికి దిగజారిన రైతు.. సింగరేణి సంస్థ వల్ల రోడ్డున పడ్డ కుటుంబం.. ఇలా రాసిన బోర్డులు మెడలో తగిలించుకుని ఎడ్లబండితో పాదయాత్రగా బయలుదేరింది రైతు కుటుంబం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన భూ నిర్వాసితుడు సుందర్లాల్పాసి తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ను కలిసేందుకు హైదరాబాద్ బయల్దేరారు.
ఈనెల 18వ తేదీన ఇల్లెందు నుంచి వారు ఎడ్లబండితో పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరారు. అయితే ఆ వార్తను వీడియోతో సహా ప్రచురించింది "వన్ ఇండియా తెలుగు". సీఎం కేసీఆర్ను కలిసేందుకు.. రైతు కుటుంబం ఎడ్లబండితో పాదయాత్ర అనే టైటిల్తో మొదటగా వార్తను పబ్లిష్ చేసింది.
సీఎంను కలవొద్దు.. న్యాయం చేస్తామన్న అధికారులు..!
ఇల్లెందు ఏరియా జేకే-5 ఓపెన్ కాస్ట్ లో భాగంగా తాము భూములు కోల్పోయామని.. ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తూ నిర్వాసితుడు సుందర్లాల్ పాసి తన భార్య, ఇద్దరు పిల్లలతో.. సీఎం కేసీఆర్ను కలిసి గోడు వెళ్లబోసుకోవాలనుకున్నారు. ఆ క్రమంలో ఈనెల 18వ తేదీ గురువారం నాడు ఎడ్లబండి కట్టుకుని పాదయాత్రగా హైదరాబాద్కు బయలుదేరారు. దీనిపై "వన్ ఇండియా తెలుగు" రాసిన వార్త వైరల్ కావడంతో జిల్లా అధికారులు అలర్టయ్యారు.
సుందర్లాల్ పాసి కుటుంబ సభ్యుల పాదయాత్ర కారేపల్లి మండలం ఆల్యా తండాకు చేరుకునే సరికి ఇల్లెందు సీఐ వేణుచందర్ వారిని కలిశారు. సమస్య పరిష్కరిస్తామని.. సీఎం కేసీఆర్ వరకు వెళ్లొద్దని ఆపారు. ఆ క్రమంలో వారిని తహసీల్దార్ స్వామి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి ఇల్లెందు ఏరియా సింగరేణి ఎస్టేట్ ఆఫీసర్ సునీతను పిలిపించి వారి సమక్షంలోనే చర్చించారు.
అధికారుల తీరుతో రోడ్డున పడ్డాం.. బాధితుల ఆవేదన..!
సుందర్లాల్ పాసి కుటుంబం దగ్గరున్న భూపత్రాలను పరిశీలించారు సింగరేణి అధికారిణి సునీత. ఆ క్రమంలో న్యాయం జరిగేలా చూస్తామన్న తహసీల్దార్ హామీతో వారు పాదయాత్ర విరమించుకున్నారు. ఆ సందర్భంగా సుందర్లాల్ పాసి మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ ఏర్పాటులో భాగంగా యాజమాన్యం తమకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
భూ నిర్వాసితుల కింద తమకు రావాల్సిన పరిహారం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నామని.. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం తీరుతో తమ కుటుంబం రోడ్డున పడిందని వాపోయారు. తమ భూములకు సంబంధించిన పత్రాలతో సహా ఆధారాలు చూపినా.. అధికారులు మాత్రం కనికరించడం లేదన్నారు. ఓపెన్ కాస్ట్లో భాగంగా తమకు సంబంధించిన దాదాపు పది ఎకరాల భూమి పోయిందని చెప్పుకొచ్చారు.
అన్నం పెట్టే రైతన్నలకు ఇన్ని కష్టాలా..?
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు దిక్కులేకుండా పోతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా రైతన్నలు కుదేలైపోతున్నారు. ఇక రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసాలు చేసే మాయగాళ్లెందరో. పనుల మీద ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పొలం శ్రామికులను చిన్నచూపు చూడటమే తప్ప వారిని ఆదరించేవారు కరువవుతున్నారు. సుందర్లాల్ పాసి లాంటి వారి ఘటనలతోనైనా అధికార యంత్రాంగంలో కాసింత మార్పు వస్తే సంతోషించదగ్గ పరిణామం.