సీఎం కేసీఆర్ను కలిసేందుకు.. రైతు కుటుంబం ఎడ్లబండితో పాదయాత్ర.. ఎందుకంటే..! వీడియో
ఖమ్మం : దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు దిక్కులేకుండా పోతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుండా రైతన్నలు కుదేలైపోతున్నారు. ఇక రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసాలు చేసే మాయగాళ్లెందరో. పనుల మీద ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పొలం శ్రామికులను చిన్నచూపు చూడటమే తప్ప వారిని ఆదరించేవారు కరువవుతున్నారు. ఆ క్రమంలో ఓ రైతు కుటుంబం తమకు జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ను వినూత్న రీతిలో కలవాలనుకోవడం చర్చానీయాంశమైంది.
సింగరేణి సంస్థ వల్ల భిక్షాటన స్థితికి దిగజారిన రైతు.. సింగరేణి సంస్థ వల్ల రోడ్డున పడ్డ కుటుంబం.. ఇలా రాసిన బోర్డులు మెడలో తగిలించుకుని ఎడ్లబండితో పాదయాత్రగా బయలుదేరింది ఓ రైతు కుటుంబం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ను కలిసేందుకు హైదరాబాద్ బయలుదేరారు.
మరో వారసుడొస్తున్నాడు.. ప్రజాయాత్రకు బయల్దేరాడు.. తెలుగు నేతల స్ఫూర్తియేనా..!
సింగరేణి సంస్థ వల్ల తమ కుటుంబం నష్టపోయిందనేది బాధితుల వెర్షన్. అందులో పనిచేసే అధికారుల తీరు వల్ల రోడ్డున పడ్డామని వాపోతున్నారు. న్యాయం కోసం పోరాడుతూ అధికారుల చుట్టూ ఏళ్లకొద్దీ తిరిగినా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో సీఎం కేసీఆర్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు హైదరాబాద్ బయల్దేరినట్లు చెబుతున్నారు బాధిత రైతు కుటుంబ సభ్యులు. మరి అంతదూరం వెళ్లి ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్న ఆ రైతు కుటుంబానికి కేసీఆర్ దర్శనభాగ్యం కలుగుతుందో లేదో చూడాలి. ఆ రైతుల ఆవేదనకు ఇప్పటికైనా పరిష్కారం దొరకాలని ఆశిద్దాం.