ముందుగా ఖమ్మం రిజల్ట్.. చివరకు నిజామాబాద్.. కౌంటింగ్కు సర్వం సిద్ధం
హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఒక్కో పార్లమెంటరీ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల చొప్పున మొత్తం 119 స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది. దానికోసం 18 జిల్లాల్లో 35 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
గురువారం (మే 23) నాడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే 5.30 గంటల వరకే తమకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. ముందుగా ఈవీఎంల తాళాలు తీసి లెక్కించిన తర్వాత ర్యాండమ్ పద్ధతిలో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు.
అమెరికాలో హరీష్ రావు.. ఆయన తీరు మారిందంటూ కామెంట్స్..!
ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టనుంది. పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్న మాట. ముందుగా ఖమ్మం లోక్సభ ఫలితం రానుంది. చివరగా నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం రిజల్ట్ రానుంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవితను వ్యతిరేకిస్తూ రైతులు అధిక సంఖ్యలో పోటీ చేయడంతో నిజామాబాద్ కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కానుంది.
మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 110 స్థానాల్లో ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు సిద్ధం చేశారు. నిజామాబాద్ బరిలో అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉండటంతో అక్కడి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక మేడ్చల్, ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో 28 టేబుళ్ల చొప్పున కేటాయించారు. దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానమైన మల్కాజిగిరిలో ఐదు వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు.