తూచ్ కేసీఆర్ చెప్పింది కాదు.. ఖమ్మంలో మా ఓటమికి కారణం వేరు : పల్లా
ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యేక పరిస్థితులు కారణమన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో ఓటమికి పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు కారణమని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాక్షాత్తు కేసీఆరే పోస్టుమార్టం నిర్వహిస్తే.. అబ్బే అదేమీ లేదు. అసలు మా పార్టీ నేతలే ఓటమికి కారణం కాదు అని సెలవిస్తున్నారు పల్లా .
ఆ ఎమ్మెల్యేలను వదలరా .. కాంగ్రెస్ ను ఖాళీ చేసేస్తారా .. నిజం ఒప్పుకున్న తుమ్మల ?
ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఓటమికి పొంగులేటి కారణం కాదన్న పల్లా
ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణం కాదని చెప్పుకొచ్చారు. పొంగులేటి అభ్యర్థిగా ప్రకటించడానికి పార్టీలో అంతర్గతంగా బోలెడన్ని కారణాలున్నాయని, అవి శ్రీనివాస్ రెడ్డి తో కూడా చర్చించామని తెలిపారు పల్లా . పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని బుజ్జగించి క్రమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాడు మహాకూటమి ప్రభావం కాదన్న కేసీఆర్ ... మహాకూటమే కారణం అంటున్న పల్లా
ఖమ్మం జిల్లా తెలంగాణ ఆంధ్రా సరిహద్దు జిల్లా గా ఉండడం వల్ల టీడీపీ ప్రభావం ఉందని, మహా కూటమి ప్రభావం వల్ల ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఖమ్మం జిల్లా ఓటమిపై టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందిస్తూ తమ పార్టీలోని నేతల వల్లే ఓటమి పాలయ్యామని చెప్పారు. కానీ ఇప్పుడు పల్లా అలాంటిదేమీ లేదని పార్టీ నుండి ఏనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని గానీ, తుమ్మల ను కానీ ఓటమికి బాధ్యుల్ని చేయలేదని, ఖమ్మం జిల్లాలో ఓటమికి వారు కారణం కాదని కొత్త కథ చెప్పారు.
ఖమ్మం ఓటమికి ప్రత్యేక పరిస్థితులు ... పొంగులేటి టికెట్ పై దాటవేత ధోరణి
ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులే టీఆర్ఎస్ ఓటమి కి కారణమయ్యాయి అన్న పల్లా ఆ పరిస్థితులను మార్చుకుంటూ ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలోకి వెళ్ళామని చెప్పుకొచ్చారు.
ఇక పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి ఎంపీ గా అవకాశం ఇస్తే గెలిచే అవకాశం లేదన్న భావనతోనే టిక్కెట్ ఇవ్వలేదా అని అడిగిన ప్రశ్నకు దాటవేత ధోరణి అవలంబించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాంటిదేమీ లేదని భౌగోళిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే టికెట్ కేటాయింపు జరిగిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అధినేత చెప్పిన వాటికి పల్లా వ్యాఖ్యలకు పొంతన లేదు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటమిపాలైన తర్వాత టిఆర్ఎస్ పార్టీ చెప్పిన విషయాలకు, ఇప్పుడు లోక్ సభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేత చెప్పిన విషయాలకు ఏమాత్రం పొంతన లేదు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో సొంత పార్టీ నేతల వల్ల కాదు, మహా కూటమి ప్రభావం వల్ల టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది పల్లా వ్యాఖ్యల వల్ల టిఆర్ఎస్ ఒప్పుకున్నట్లే అని తెలుస్తుంది.