3 లక్షలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు.. ఏసీబీ వలలో లంచావతారం..!
కొత్తగూడెం : ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. వేలల్లో కాదు ఏకంగా మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయాడు ఓ సీనియర్ అధికారి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. నెల నెలా జీతాలు తీసుకోవడమే గాకుండా ఇంత పెద్ద మొత్తంలో లంచాలు తీసుకోవడం హాట్ టాపికైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని కేటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ ఆనంద్ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేటీపీఎస్ పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయడానికి సదరు చీఫ్ ఇంజినీర్ మూడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే భారీ మొత్తంలో లంచం అడగడంతో ఆ కాంట్రాక్టర్ కంగు తిన్నారు. దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
కేసీఆర్ మరో ఎత్తుగడ.. ఆర్టీసీ సమ్మె విఫలం చేయడానికేనా..! కార్మిక సంఘాల వ్యూహమేంటో?
కాంట్రాక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు చీఫ్ ఇంజినీర్ ఆనంద్పై వల పన్నారు. సదరు కాంట్రాక్టర్ లంచం ఇస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్గా దాడి చేశారు. అతడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని.. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.
కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్లులు విడుదల చేయడానికి ఇంత పెద్ద మొత్తంలో సదరు అధికారి లంచం అడిగిన తీరు స్థానికంగా చర్చానీయాంశమైంది. కేటీపీఎస్లో చేసిన పనులకు గాను ఆయనకు రిలీజ్ చేయాల్సిన బిల్లులు చెల్లించకుండా అడ్డుకున్న సదరు ఇంజినీర్.. లంచం ఇస్తే గానీ బిల్లులు ఇవ్వలేనంటూ వేధించడం.. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతోనే ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.