పార్టీ వీడను కానీ, నేను తలుచుకుంటే: రేణుకా చౌదరి, ఆమెకు పోటీగా ఇప్పటికే దరఖాస్తు!
ఖమ్మం: తనకు కాంగ్రెస్ పార్టీలో చాలా అన్యాయం జరిగిందని, కానీ ఆ పార్టీని విడిచిపెట్టనని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను భ్రష్టు పట్టించే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పదవులు వచ్చినంత మాత్రాన కిరిటీలా రావని చెప్పారు.
నాకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తా: కాంగ్రెస్కు రేణుకా చౌదరి ఝలక్
ఖమ్మంలో గెలుపు క్రెడిట్ అంతా వాళ్లదే
అభ్యర్థుల ఎంపికపై ఎవరు బాధ్యత తీసుకుంటారని రేణుకా చౌదరి ప్రశ్నించారు. జిల్లాలో పనికి రానివాళ్లు కొందరికి బినామీలుగా బతుకుతున్న వాళ్లకు బాధ్యతలు ఇస్తారా అని నిలదీశారు. అనామకులకు చదువురాని వాళ్లకు బాధ్యతలు ఇస్తే పార్టీ సర్వనాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో తన వల్లే గెలుపు అని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. కానీ గెలుపు క్రెడిట్ అంతా కార్యకర్తలది అన్నారు.
నేను తలుచుకుంటే వాళ్లు గెలిచేవారా?
ఎన్నికల్లో సహకరించలేదని తనపై ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని రేణుకా చౌదరి మండిపడ్డారు. నేను తలుచుకుంటే వాళ్లు గెలిచేవాళ్లా అని ప్రశ్నించారు. ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీ తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పింది ఏమిటి, ఇక్కడ జరుగుతున్నది ఏమిటని ప్రశ్నించారు. కాబోయే ముఖ్యమంత్రిని నేనే, కాబోయే మంత్రిని నేనే అని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారని తీవ్రంగా నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీకి ఈ విషయాలు అన్ని తెలియడం లేదని వాపోయారు. డీసీసీ నియామకంలో ఒక్క ఎస్సీ కూడా లేడన్నారు.
లీకులు రావడంతో మనస్తాపం
ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇతరులకు ఇస్తారని లీకులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఈసారి టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ పార్టీన వీడనని చెప్పారు. టిక్కెట్ ఇవ్వకుంటే మీరు పార్టీని వీడాలని పలువురు ఒత్తిడి తెచ్చారు. కానీ ఆమె మాత్రం పార్టీని వీడనని చెబుతున్నారు. కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ గతంలో ఇక్కడి నుంచి గెలుపొందిన రేణుక కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఆశలు పెట్టుకున్న సీట్లలో ఖమ్మం, నల్గొండలు ఉన్నాయి.