నాకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తా: కాంగ్రెస్కు రేణుకా చౌదరి ఝలక్
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గురువారం ఝలక్ ఇచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో తనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కేటాయించకుంటే తాను రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆమె ఈ రోజు ఖమ్మంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తాను వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తనకు పార్టీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వకుంటే తాను పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని చెప్పారు. ఆ పార్టీకి ఇది ఊహించని షాక్ అని చెప్పవచ్చు.
ఖమ్మంలో మాత్రమే సత్తా
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో తెరాస సత్తా చాటింది. కేవలం ఖమ్మం (ఉమ్మడి) జిల్లాలో మాత్రమే టీడీపీ - కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి.. మిగతా జిల్లాల కంటే ఎక్కువ స్థానాలు గెలిచింది. దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్-టీడీపీలకు ఉన్న పట్టు మరోసారి తేలింది. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉంది.
టీడీపీ, లెఫ్టిస్టులకు పట్టు
తెలుగుదేశం పార్టీతో పాటు లెఫ్టిస్ట్లకు ఇక్కడ పట్టు ఉంది. సామాజిక కోణంలో టీడీపీకి ఇక్కడ కేడర్ ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, లెఫ్ట్ పార్టీ కలవడంతో.. మిగతా జిల్లాల్లో సత్తా చాటని ఈ కూటమి.. ఖమ్మంలో మాత్రం పట్టు నిలుపుకుంది. ఇప్పుడు రేణుకా చౌదరి అదే ధైర్యంతో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
తెరాస వైపు చూస్తున్నారా?
అదే సమయంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదని కొందరు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైన పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి వంటి నేతలు తెరాసలో చేరారు. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన జగ్గారెడ్డి.. కేసీఆర్కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి కూడా అధికార తెరాస వైపు చూస్తున్నారా, అందుకే తనకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీని వీడుతానని హెచ్చరిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.