ఖమ్మంలో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.... తృటిలో తప్పిన పెను ప్రమాదం...
ఖమ్మం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కేబిన్లోనే ఇరుక్కుపోయాడు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తుండగా తల్లాడ మండలం మెట్టుపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కేబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసి 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఓ బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ నెల జూన్లో మంచిర్యాల జిల్లాలోనూ ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. దండేపల్లి మండలం కన్నెపల్లి హైవేపై బస్సు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ సహా మొత్తం ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్,క్లీనర్ లారీ కేబిన్లో చిక్కుకుపోగా... వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.