ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం... బస్సు-డీసీఎం ఢీ... 14 మందికి తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు,డీసీఎం ఢీకొన్న ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
భద్రాచలం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో పాలేరు వైపు వెళ్తుండగా... పాలేరు జలాశయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డీసీఎం ఫ్రంట్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డీసీఎం డ్రైవర్ సహా బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. అందరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం తర్వాత రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఉన్న డీసీఎం,బస్సును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాద కారణాలు ఇప్పటికైతే తెలియరాలేదు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఏడాది అగస్టులో కూసుమంచి సమీపంలోనే చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ అడిషనల్ సీపీ బాలు జాదవ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. స్వగ్రామం లోక్యతండాకు వెళ్లి ఖమ్మం పట్టణానికి తిరుగుపయనమైన ఆయన... జీళ్ల చెరువు వద్ద ప్రమాదానికి గురయ్యారు.
రెండు రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మస్తాన్ వలీ కుమారుడు షేక్ ఫారుఖ్(22) మృతి చెందిన సంగతి తెలిసిందే. తన ఫ్రెండ్ ఫయాజ్తో కలిసి గుంటూరు నుంచి అతను బైక్పై హైదరాబాద్ బయలుదేరాడు. చలి ఎక్కువగా ఉండటంతో ధర్మోజిగూడెం వద్ద బైక్ ఆపారు. షారుఖ్ స్వెట్టర్ ధరిస్తుండగా... వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. షారుఖ్ మిత్రుడు ఫయాజ్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.