Telangana: రోడ్డు ప్రమాద క్షతగాత్రులను తన కాన్వాయ్ లో ఆసుపత్రికి తరలించిన మంత్రి..!
ఖమ్మం: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తన కాన్వాయ్ లోని వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సకాలంలో వారిని ఆసుపత్రిలో చేర్చడంలో సహకరించారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం లభించేలా ఆయన చర్యలు తీసుకోగలిగారు. తన సొంత ఆసుపత్రికి తరలించి, ఉచిత వైద్యం అందించారు.
Disha Murder case: వారిని ఉరి తీరి తీయడానికి రెడీగా ఉన్నా: ఆ పని అప్పుడే చేయాల్సింది: తలారి పవన్
పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం తన సొంత నియోజకవర్గం ఖమ్మంలో పర్యటించారు. ఈ ఉదయం ఆయన తన కాన్వాయ్ లో హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో వరంగల్ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందినదిగా భావిస్తోన్న లారీ ఎదురుగా వస్తోన్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తోన్న ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఒకరు మహిళ.
లారీ నంబర్ డబ్ల్యూబీ 11 ఇ 0631. వరంగల్ క్రాస్ రోడ్స్ కు నుంచి ప్రధాన రహదారి మీదికి వచ్చిన వెంటనే ప్రమాదానికి గురైంది బైక్. అదే సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ అటుగా వెళ్లింది. రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలుసుకున్న వెంటనే అజయ్ కుమార్ తన కాన్వాయ్ ను ఆపారు. కారు దిగి- క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
అంబులెన్స్ కు ఫోన్ చేశారు పోలీసులు. అంబులెన్స్ రావడంలో జాప్యం జరుగుతోందనే విషయం తెలియడంతో.. వెంటనే తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనంలో వారిని తరలించారు. ఖమ్మంలో గల మమత ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఆసుపత్రికి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబానికి చెందినదే. అక్కడ బాధితులకు ఉచితంగా వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ మితిమీరిన వేగంతో ప్రయాణించడం, అదుపు తప్పి ఎదురుగా వస్తోన్న బైక్ ను ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.