విషాదం : వాగు దాటుతూ తండ్రి గల్లంతు... బోరున విలపించిన కొడుకు
సోమ(అక్టోబర్ 12),మంగళ(అక్టోబర్ 13) వారాల్లో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో మొత్తం 12 మంది మృతి చెందారు. ఇళ్లు కూలిపోయి కొందరు,వాగులు,వరద నీటిలో కొట్టుకుపోయి మరికొందరు మృతి చెందారు. ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి కొడుకు కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయి శవమై తేలాడు.
ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన రవి కోతుల బెడదతో ప్రతీరోజూ చేను వద్దకు వెళ్లి కాపలా కాస్తున్నాడు. మంగళవారం కొడుకుతో కలిసి చేనుకు వెళ్లాడు. సాయంత్రం సమయంలో ఇంటికి తిరిగొస్తుండగా... మార్గమధ్యలో వాగు ఉప్పొంగింది. దీంతో తండ్రీ కొడుకులిద్దరూ చేతులు పట్టుకుని వాగు దాటేందుకు ప్రయత్నించారు. అయితే వాగు ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఇద్దరూ నీళ్లలో పడి కొట్టుకుపోయారు. కొంతదూరం కొట్టుకుపోయాక రవి కుమారుడు ఓ చెట్టు కొమ్మ ఆసరాతో ఒడ్డుకు చేరాడు.
అక్కడే కాసేపు తండ్రి కోసం గాలించినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఇంటికి పరిగెత్తాడు. కుటుంబ సభ్యులు,అధికారులకు విషయం చెప్పాడు. దీంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు బుధవారం(అక్టోబర్ 15) ఉదయం రవి మృతదేహం లభ్యమైంది. తన లాగే తండ్రి కూడా ఎలాగోలా బయటపడుతాడని భావించిన రవి కుమారుడు తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. పేద రైతు రవి మృతితో అతని కుటుంబం తల్లడిల్లుతోంది.
హైదరాబాద్లోని పాతబస్తీ చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడలో భారీ వర్షాలకు రెండు ఇళ్లు కూలిపోవడంతో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
కాగా,తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలాచోట్ల వాగులు,వంకలు,చెరువులు,నాలాలు పొంగిపొర్లుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు,మూడు రోజులు భారీ వర్ష సూచన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే బుధ,గురువారాల్లో ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించింది. అత్యవసర సేవల కోసం ప్రజలు 040-211111111 నంబర్ను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.
Recommended Video