లండన్లో అదృశ్యమైన శ్రీహర్ష మృతి..ఖమ్మం బీజేపీ అధ్యక్షుడి ఇంట్లో తీవ్ర విషాదం
ఖమ్మం: ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ ఇంట్లో విషాదం నెలకొంది. లండన్లో చదువుకునే ఉదయ్ ప్రతాప్ కుమారుడు శ్రీహర్ష 12 రోజుల క్రితం అదృశ్యమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రీహర్ష కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే లండన్ బీచ్లో శ్రీహర్ష మృతదేహంను పోలీసులు కనుగొన్నారు.
తన కొడుకు ఆచూకీ లభించకపోవడంతో వారం రోజుల క్రితం శ్రీహర్ష తల్లిదండ్రులు లండన్కు వెళ్లారు. ఇదిలా ఉంటే శ్రీ హర్ష ఎలా అదృశ్యమయ్యాడు అనేదానిపై లండన్ పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో స్థానిక బీచ్లో శ్రీహర్ష మృతదేహంను పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్యచేసి ఉంటారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
శ్రీహర్ష పీజీ కోర్సు చేసేందుకు లండన్ వెళ్లాడు. చదువులో ఎప్పుడూ ముందుండే విద్యార్థి తన కొడుకని తండ్రి ఉదయ్ ప్రతాప్ చెబుతున్నారు. కాలేజీ అంటే అశ్రద్ధ ఉండేది కాదని చెప్పారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తన కొడుకు ఇలా శవమై వస్తాడని తాము ఊహించలేదని శ్రీహర్ష తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదిలా ఉంటే లండన్లో స్థానిక బీచ్ వద్ద శ్రీహర్షకు సంబంధించిన ల్యాప్ట్యాప్, ఇతర వస్తువులను లండన్ పోలీసులు గుర్తించారు. అంతేకాదు 'హ్యాండ్ ఓవర్ మై బిలాంగింగ్స్ టూ మై పేరెంట్స్' అని రాసి ఉన్న ఒక లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. శ్రీహర్ష కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు హెలికాఫ్టర్లను గాలింపు చర్యల కోసం వినియోగించారు.