ఖమ్మంలో ఆర్టీసీ సమ్మె ఉధృతం.. కార్మికుడిపైకి మేయర్ కారు..
Recommended Video
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీసుకొన్న సంచలన నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పలు జిల్లాలో చెదురు మదురు సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉద్యమ సెగ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నది.
సమ్మె ఎఫెక్ట్ : అద్దె, స్కూల్ బస్సులతో రవాణా అధికారుల ఏర్పాట్లు
ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. సోమవారం ఉదయమే రోడ్లపైకి వచ్చి ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మేయర్తో ఉద్యోగులు ఘర్షణకు దిగారు. ఆయన కారును అడ్డుకొనేందుకు ప్రయత్నించగా ఓ ఉద్యోగి గాయపడ్డట్టు సమాచారం.
ఖమ్మం జిల్లాలో మేయర్ పాపాలాల్కు ఆర్టీసీ కార్మికులు నిరసన సెగను ప్రత్యక్షం చూపించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డు తగిలారు. ఆ క్రమంలో ఆయన తన వెహికిల్ను ముందుకు తీసుకెళ్లగా ఓ కార్మికుడికి స్వల్ప గాయమైంది. దాంతో కార్మికుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆర్టీసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మూడో రోజుకు చేరుకోవడం, దీనిని మరింత ఉధృతంగా మార్చి ప్రభుత్వాన్ని దిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్లో ఆర్టీసీ జేఏసీ చేస్తున్న దీక్షకు ఎంపీ రేవంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు మద్దతు ప్రకటించారు.
కాగా, ఆర్టీసీ యూనియన్ నేతలను అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో చర్చలు సఫలం కాకపోతే ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆదివారం రాత్రి ఆర్టీసికి చెందిన 48 వేల మంది కార్మికులను తొలగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిదే.