ఏడో వికెట్ డౌన్, కేసీఆర్ను కలిసిన కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే: 19 నుంచి 11 తగ్గిన కాంగ్రెస్ బలం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతోంది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికలకు మరో ఇరవై నాలుగు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన తెరాసలో చేరారు. మరో ఎడేనిమిది మంది ఎమ్మెల్యేలు తెరాస నేతలతో చర్చిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
చదవండి: 'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్కేనా?
ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యే షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ కూటమి సత్తా చాటింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే. ఇక్కడి నుంచే ఇప్పటికి ఒక టీడీపీ ఎమ్మెల్యే సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే చేయిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం కొత్తగూడెంఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు.
కేసీఆర్తో భేటీ అనంతరం వనమా మీడియాతో మాట్లాడారు. తాను త్వరలో కారు ఎక్కుతున్నట్లు చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవడం తన విధి అని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
వనమా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ఆయన పార్టీని వీడి, తెరాసలో చేరుతున్నట్లు లేఖ విడుదల చేశారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనను ఎంతో ఆకర్షిస్తున్నాయని చెప్పారు.
ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియ, కందా ఉపేందర్ రెడ్డి తదితరులు కారు ఎక్కారు. ఇప్పుడు వనమా కూడా ఆ జాబితాలో చేరారు. ఈ చేరికతో కాంగ్రెస్ బలం 19 నుంచి 11కు తగ్గుతుంది. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తెరాసలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఆయన తెరాసలో చేరుతున్నారని చెబుతున్నారు. అయన ఇటీవల కేటీఆర్తో భేటీ అయ్యారు. సుధీర్ రెడ్డి కూడా చేరితో ఎనిమిదో వికెట్ అవుతుంది.