కొడాలి నానికి చుక్కెదురు: స్వగ్రామంలో టీడీపీ క్యాండెట్ విక్టరీ
ఏపీ పంచాయతీ రెండో విడత ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. అయితే వైసీపీ పెట్టని కోటలో టీడీపీ పాగా వేస్తోంది. మంత్రి కొడాలి నాని గ్రామంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలం యలమర్రు గ్రామం కొడాలి నాని స్వగ్రామం అనే సంగతి తెలిసిందే. ఇక్కడ సర్పంచ్గా టీడీపీ అభ్యర్థి కొల్లూరి అనూష 800 ఓట్లతో విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
టీడీపీ నేతలను మంత్రి కొడాలి నాని బూతులు తిట్టడాన్ని యలమర్రు గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారని పేర్కొన్నారు. కొడాలి నాని బలపర్చిన అభ్యర్థిని ఓడించారని స్థానిక టీడీపీ నేతలు అన్నారు. ఈ విజయం చూసైనా కొడాలి తీరు మారాలని సూచించారు. మరోవైపు గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో 20 పంచాయతీలకు గాను తొమ్మిది గ్రామాల సర్పంచ్లుగా టీడీపీ మద్దతు అభ్యర్థుల విజయం సాధించారు. పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఇక వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామంలోనూ టీడీపీ అభ్యర్థి గెలిచారు. రామచంద్రాపురం నియోజకవర్గం హసన్బాదలో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ మద్దతుదారుడు నాగిరెడ్డి సతీష్ రావు 208 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా విజయం సాధించారు.