హత్యలే... వీడిన మూడు మృతదేహాల మిస్టరీ... వివాహేతర సంబంధమే కారణం...
కృష్టా జిల్లాలో విస్సన్నపేట శివారులోని నాగార్జునసాగర్ కాల్వ పక్కన సోమవారం(అక్టోబర్ 5) ఉదయం మూడు మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మిస్టరీని పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని నిర్దారించారు. హత్య అనంతరం దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు చెప్పారు. విస్సన్న పోలీస్ స్టేషన్లో స్థానిక ఎస్పీ రవీంద్రనాథ్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
అసలేం జరిగింది...
కృష్ణా జిల్లా ఈదర గ్రామానికి చెందిన చిన్న ఏసు(35) భార్య తిరుపతమ్మ,మీనాక్షిలతో కలిసి కొంతకాలంగా నూజివీడులో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో చింతలపూడికి చెందిన దాసరి వెంకన్న అనే వ్యక్తి వద్ద కొద్ది నెలల క్రితం పనిలో చేరాడు. ప్రతీరోజూ గ్రామాల్లో ఆటో ట్రాలీలో తిరుగుతూ పింగాణి వస్తువులు అమ్మడం చిన్న ఏసు పని. కొద్దిరోజుల క్రితం వివాహేతర సంబంధం విషయంలో చిన్న ఏసుకు,వెంకన్నకు మధ్య తీవ్ర వాగ్వాదం,ఘర్షణ జరిగింది. అప్పటినుంచి వెంకన్న చిన్న ఏసుపై కక్షతో రగిలిపోయాడు.
ఇలా హత్యకు స్కెచ్..
తన కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్న చిన్న ఏసు హత్యకు స్కెచ్ వేశాడు.ఇందులో భాగంగా ఆదివారం(అక్టోబర్ 4) వెంకన్న అతన్ని పిలిపించాడు. జరిగిందేదో జరిగిపోయిందని అతన్ని నమ్మించాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అనంతరం నూజివీడు వెళ్దామని వెంకన్న చెప్పడంతో అతనితో పాటు చిన్న ఏసు,చిన్న ఏసు భార్య తిరుపతమ్మ,కుమార్తె మీనాక్షి కూడా ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో వెంకన్న భార్య నాగమణి,కుమారుడు మరో ఆటోలో తారసపడ్డారు. నిజానికి ఇది కూడా వెంకన్న స్కెచ్లో భాగమే.
కిరాతకంగా ముగ్గురి హత్య...
నాగమణి,కుమారుడు తారసపడటంతో వెంకన్న ఆటో ఆపి కిందకు దిగాడు. అనంతరం చిన్న ఏసు కుటుంబం,వెంకన్న కుటుంబం కలిసి సమీపంలోని మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ చిన్న ఏసుకు మరోసారి మద్యం తాగించారు. ఆపై ఇనుపరాడ్డుతో బలంగా తలపై మోది హత్య చేశారు. దీంతో తిరుపతమ్మ అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా... ఆమెను వెంబడించి పట్టుకుని హతమార్చారు. మీనాక్షిని కూడా అదే తరహాలో హత్య చేశారు. హత్యానంతరం ఈ ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
మృతదేహాలను ఆటోలో తీసుకొచ్చి విస్సన్నపేట శివారులోని నాగార్జున సాగర్ పక్కనున్న కాల్వలోకి తోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆటో ముందు భాగం గోడలో ఇరుక్కుపోగా అందులోని మృతదేహాలు పొదల్లో పడిపోయాయి. వెంకన్న ఆటోతో ఆ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టి కాల్వలో పడేయాలని ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ తర్వాత మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.