420 తాతయ్యా..!! వైసీపీ, టీడీపీ నేతల మధ్య హద్దులు దాటుతున్న ట్వీట్ల యుద్ధం
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం ముదురుతోంది. వ్యక్తిగత విమర్శలకు మళ్లుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని తప్పులను ఎత్తి చూపుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే విమర్శలకు కౌంటర్ అటాక్ దిగుతున్నారు. తాజాగా శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై ఎదురుదాడికి దిగారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. విజయసాయి రెడ్డిని 420 తాతయ్యా అంటూ సంబోధించారు.
టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ @AndhraPradeshCM గారు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వాయించుకునే పెద్ద మనిషి ఇన్నాళ్లు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలి. @ysjagan @YSRCParty @ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 30, 2019
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో ముస్లింలకు దుకాణాల కేటాయింపు, తిరుమలలో ఆర్టీసీ బస్ టికెట్ల వెనుక అన్యమత ప్రచారానికి సంబంధించిన వివాదాలు తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే. వాటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వవైఎస్ జగన్ దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో పనిచేస్తోన్న హిందూయేతర ఉద్యోగులు వెంటనే బయటికి రావాలని, సంబంధిత శాఖ కమిషనర్ కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. దీనిపై విజయసాయి రెడ్డి శుక్రవారం ఓ ట్వీట్ సంధించారు. ఈ ట్వీట్ కాస్తా బుద్ధా వెంకన్నకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్టయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం సహా దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని సాయిరెడ్డి ప్రశంసించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వాయించుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలనేది ఆ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ పై బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. 420 తాతయ్య విజయసాయిరెడ్డి గారూ! అని సంబోధించారు. కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం వైఎస్ఆర్సీపీకే చెల్లిందని విమర్శించారు. అసలు టీటీడీలో అన్యమతస్థులను జొప్పించిందే మహామేత (దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి) అని పేర్కొన్నారు. కావాలంటే వెళ్లి జీవోలు చూసుకోవాలని సూచించారు. పరమానందయ్య శిష్యుడిలా సొల్లు చెప్పొద్దంటూ ధ్వజమెత్తారు.
420 తాతయ్యా @VSReddy_MP గారూ! కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చెయ్యడం మీకే చెల్లింది. అసలు టీటీడీలో అన్యమతస్థులను జొప్పించిందే మీ మహామేత. కావాలంటే వెళ్లి జీవోలు చూసుకో. ఇప్పుడొచ్చి పరమానందయ్య శిష్యుడిలా సొల్లు చెప్పకు.
— venkanna_budda (@BuddaVenkanna) August 30, 2019