ఘోర రోడ్డు ప్రమాదం... నుజ్జునుజ్జయిన కారు... ముగ్గురు అక్కడికక్కడే మృతి...
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం(డిసెంబర్ 7) ఉదయం బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలో... రోడ్డు పక్కన ఆగి వున్న లారీని ఓ కారు అతివేగంతో వెనుక నుంచి ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి.
ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా భీమవరంలో ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. మృతులను చీమకుర్తి నాగేశ్వరవు, తాతారావు, కనకదుర్గ రావులుగా గుర్తించిన పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.
మృతుల్లో ఒకరు విజయవాడ వాసిగా,మరో ఇద్దరు చింతలపూడి మండలం ఎర్రగొండపల్లెకి చెందినవారిగా గుర్తించారు.ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోగా... పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Recommended Video
ఈ ఏడాది జూన్లో ఇదే కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మధిర మండలం తొండగ గోపవరం గ్రామానికి చెందిన దాదాపు 25 మంది ట్రాక్టర్లో వేదాద్రి దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.