చిన్న నాటి ప్రేమకు పెద్దల అడ్డు : రైలు పట్టాల పై ప్రేమ జంట ఆత్మహత్య
పెద్దలు తమ ప్రేమను..పెళ్లికి అంగీకరించలేదనే మనో వేదనతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. వాళ్లిద్దరిదీ ఒకే ఊరు..ఒకటే సామాజిక వర్గం. చిన్నప్పటి నుండి ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి సిద్దపడ్డారు. కానీ, పెద్దలు ససేమిరా అన్నారు. దీంతో..పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారిద్దరూ ప్రాణాలు తీసుకున్నారు. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలుకా అత్తిమంజరి గ్రామానికి చెందిన జి శంకర్ కుమార్తె మౌనిష..అదే గ్రామానికి చెందిన కుప్పుస్వామి కుమారుడు హేమంత్ కుమార్ లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కారణాలు తెలియలేదు కానీ..వీరిద్దరూ కుప్పం రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఒకే గ్రామంలో ఉంటున్న వారిద్దరూ చిన్న నాటి నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు సైతం తెలియచేసారు. కానీ, ఆ ప్రేమకు మౌనిష కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. అమ్మాయి మేనమామా తో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. దీంతో..ప్రేమికులు ఇద్దరూ మనస్థాపానికి గురయ్యారు. మంగళవారం రాత్రి కుప్పం చేరుకొని స్థానిక రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం టిక్కెట్లు కొనుగోలు చేసారు. స్టేషన్ కు కూత వేటు దూరంలో దళవాయి కొత్త పల్లె వద్ద రైలు పట్టాల పై ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా వారిద్దరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి..శవ పరీక్ష చేయించి వారికి మృతదేహాలను అప్పగించారు.
బంధువుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, రైల్వే ట్రాక్ పై ఇద్దరి మృత దేహాలను చూసిన స్థానికులతో పాటుగా పోలీసులు సైతం ఆవేదనకు గురయ్యారు. ఇద్దరి తలలు ఛిద్రం కావటంతో.. వారు రైలు కింద తలలు పెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.