క్షణక్షణానికి మారే వాతావరణంతో పోటీ: అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన గంధం చంద్రుడి కుమారుడు
కర్నూలు: ఏపీ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడు కుమారుడు గంధం భువన్ జయ్ మరో చరిత్రను సృష్టించాడు. ఇదివరకు లఢక్లో అతి ఎత్తయిన ఖర్దుంగ్ లా శిఖరాన్ని అధిరోహించిన ఎనిమిదేళ్ల భువన్.. మరోసారి అలాంటి సాహస కృత్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. ఐరోపా ఖండంలో అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించాడు. ఈ శిఖరం ఎత్తు 5,642 మీటర్లు. ఈ నెల 18వ తేదీన భువన్ జయ్ ఈ రికార్డు నెలకొల్పాడు.
మోడీ బొమ్మతో ఓట్లు పడవ్: అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గ్లామర్ పనిచేయదు: బీజేపీ మాజీ సీఎం
రష్యాలో ఉంటుందీ మౌంట్ ఎల్బ్రస్. ఐరోపా ఖండంలో ఉన్న ఏడు అతిపెద్ద శిఖరాగ్రాల్లో ఇదీ ఒకటి. దీని ఎత్తు 5,642 మీటర్లు. ప్రతి నిమిషం అక్కడి వాతావరణం మారుతుంటుంది. అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది దీని శిఖరాగ్రం. మైనస్లో ఉంటుంది అక్కడి టెంపరేచర్. అలాంటి శిఖరం.. అగ్రభాగాన్ని అందుకోవాలంటే సాహసమే. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. దానికి మించిన ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. క్షణక్షణానికి మారిపోయే వాతావరణానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉండాలి.
ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ మౌంట్ ఎల్బ్రస్ను విజయవంతంగా అధిరోహించాడు గంధం భువన్ జయ్. మూడో తరగతి చదువుతున్నాడీ బుడతడు. క్రీడలు, పర్వతాల అధిరోహణ పట్ల చిన్నప్పటి నుంచే అతనిలో ఆసక్తి ఏర్పడింది. దీన్ని గమనించిన గంధం చంద్రుడు తన కుమారుడిని ఆ దిశగా ప్రోత్సహించాడు. అనంతపురం జిల్లా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద శిక్షణ ఇప్పించాడు. అనంతరం కడప జిల్లా గండికోటలో ఉన్న అడ్వెంచర్ స్పోర్ట్స్ క్లబ్లో సాంకేతికంగా మెళకువలను ఇప్పించారు గంధం చంద్రుడు.
2021 మేలో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన విశాఖపట్నానికి చెందిన భూపతి రాజు వర్మ, బెంగళూరుకు చెందిన నవీన్ మల్లేష్తో కలిసిన టీమ్తో గంధం భువన్ జయ్ తన రష్యా ప్రయాణాన్ని ఆరంభించాడు. ఈ నెల 11వ తేదీన రష్యాకు బయలుదేరి వెళ్లారు. అనంతరం టెర్స్కాల్లోని మౌంట్ ఎల్బ్రస్ బేస్ క్యాంప్ను చేరుకున్నాడు. 13వ తేదీన 3,500 మీటర్లు, 15న 4,300 మీటర్లు, 18వ తేదీన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాగ్రాన్ని అందుకున్నాడు.
Recommended Video
19వ తేదీన మళ్లీ టెర్స్కాల్ బేస్క్యాంప్కు చేరుకున్నాడు. ఈ నెల 23వ తేదీన టీమ్తో కలిసి గంధం భువన్ జయ్ స్వదేశానికి చేరుకోనున్నాడు. ప్రతికూల వాతావరణంలోనూ ఎనిమిదేళ్ల మూడు నెలల వయస్సున్న ఆ బాలుడు మౌంట్ ఎల్బ్రస్ శిఖరాగ్రాన్ని అందుకోవడం పట్ల రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి.