ఆదోని పరువు హత్య : 8 ఏళ్ల ప్రేమ.. అంతా సద్దుమణిగిందనుకునే లోపే.. కులం కాటుకు బలి...
కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన పరువు హత్యకు సంబంధించి పలు విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. హత్యకు గురైన దళిత యువకుడు ఆడమ్ స్మిత్,అతని భార్య మహేశ్వరి డిసెంబర్ 1న కర్నూలు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి రక్షణ కోరారు. ఎస్పీ ఆదేశాలతో ఎమ్మిగనూరు సీఐ మంజునాథ్ ఇరువురి కుటుంబాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారితో మాట్లాడారు. అయినప్పటికీ మహేశ్వరి తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. ఆ జంట ఊళ్లో అడుగుపెట్టవద్దని హెచ్చరించారు.
Recommended Video
ఇద్దరూ కలిసి ఊళ్లోకి వస్తే పరువు పోతుందన్నారు. మహేశ్వరి తల్లిదండ్రులు లక్ష్మి ఈరన్న హెచ్చరికతో... తాము ఊళ్లోకి రామని,ఉద్యోగ రీత్యా వేరే చోట ఉంటామని చెప్పారు. దీంతో కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపించిన లక్ష్మి,ఈరన్న ఇతర కుటుంబ సభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అంతా సద్దుమణిగిందని ప్రశాంత జీవితం గడుపుతున్న ఆ జంటకు ఊహించని షాక్ తగిలింది.
బ్యాంకు కోచింగ్ అని చెప్పి స్మిత్తో...
పోలీసుల కథనం ప్రకారం... కర్నూలు జిల్లా నందవరం గురజాలకు చెందిన నాగన్న,సువార్తల మూడో కుమారుడు ఆడమ్స్మిత్ (35). ప్రస్తుతం అతను ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన లక్ష్మి,ఈరన్నల కుమార్తె మహేశ్వరి,స్మిత్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కుమార్తె ప్రేమ విషయం తెలియని తల్లిదండ్రులు నవంబర్,2020లో ఆమెకు మరొకరితో నిశ్చితార్థం చేశారు. అయిష్టంగానే నిశ్చితార్థం చేసుకున్న మహేశ్వరి నవంబర్ 12న నంద్యాలలో బ్యాంకు కోచింగ్కు వెళ్తున్నట్లు చెప్పి ఆడమ్ స్మిత్తో కలిసి హైదరాబాద్ చేరుకుంది.
ఊళ్లో అడుగుపెట్టవద్దని హెచ్చరిక...
హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో ఆర్య సమాజ్లో మహేశ్వరి-స్మిత్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నగరంలోనే స్నేహితుల వద్ద కొన్ని రోజులు ఉన్నారు. ఈ విషయం తెలిసిన మహేశ్వరి కుటుంబ సభ్యులు పలుమార్లు స్మిత్కు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారు. దీంతో వారి డిసెంబర్ 1న కర్నూలు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి రక్షణ కోరారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు సీఐ ఇరువురి కుటుంబాలను పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మహేశ్వరి కుటుంబం వెనక్కి తగ్గకపోగా... ఊళ్లోకి అడుగుపెట్టవద్దని ఆ జంటను హెచ్చరించారు. తాము వేరే చోట ఉంటామని చెప్పడంతో కాస్త శాంతించినట్లే కనిపించి అక్కడినుంచి వెళ్లిపోయారు.
అంతా సద్దుమణిగిందనుకునేలోపే..
ఇక అంతా సద్దుమణిగిందని భావించి మహేశ్వరి,స్మిత్ ఆదోని ఆర్టీసీ కాలనీలో అద్దె ఇంట్లో కాపురం మొదలుపెట్టారు. కొద్దిరోజులుగా ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఇదే క్రమంలో ఆడమ్ స్మిత్(35) గురువారం(డిసెంబర్ 31) విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. నూతన సంవత్సరం కావడంతో మార్గమధ్యలో ఓ బేకరీలో కేక్ కొనుగోలు చేశాడు. అనంతరం బైక్పై బయలుదేరగా... ఓచోట అతన్ని అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బండరాయితో స్మిత్ తలపై బలంగా మోది హత్య చేశారు. స్మిత్ను స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
దళితుడు అన్న కారణంతోనే...?
తండ్రి ఈరన్న,పెద్దనాన్న పెద్ద ఈరన్నలే ఈ హత్య చేయించారని మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సహా ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కుమారుడిని మృతదేహాన్ని చూసి స్మిత్ తల్లిదండ్రులు బోరున విలపించారు. దళితులం అయినందుకే తన కొడుకుని చంపేశారని కన్నీరుమున్నీరయ్యారు. 'క్షమించండి మామయ్యా..' అంటూ మహేశ్వరి ఆయన కాళ్లు పట్టుకుని వేడుకున్నారు.