కర్నూలు జిల్లాలో అధికార వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ ... కర్రలు,రాళ్ళతో దాడి
ఏపీలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య నే కాదు వైసీపీ కార్యకర్తలలో వారిలో వారి మధ్య కూడా తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామంలో వైసిపి కార్యకర్తలు రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ చిలికి చిలికి గాలివాన అయింది. రాళ్లతో, కర్రలతో కొట్టుకునే దాకా వెళ్లింది.
ఓర్వకల్లు గ్రామంలో మంచినీటి సరఫరా విషయంలో తలెత్తిన ఘర్షణలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్నారు. ఓ వైసీపీ వర్గం, మరో వర్గం పై దాడి దిగడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఓర్వకల్లు గ్రామంలో గత మూడు రోజుల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానిక వైసీపీ నాయకుడు శేఖర్ మరమ్మతు పనులు చేపట్టారు. ఇక ఈ విషయం తెలియడంతో పనులు చేయడానికి నువ్వు ఎవరు అంటూ మరో వైసీపీ నాయకుడు భాస్కర్ రంగంలోకి దిగాడు.
తన అనుచరులతో కలిసి భాస్కర్ వీరంగం వేసాడు. ఓర్వకల్లు గ్రామంలో ఏ పని చేయాలన్నా అది తామే చేయాలని అలా కాదని ఎవరి ఇష్టారాజ్యంగా వారు పనులు చేస్తే చంపేస్తామని శేఖర్ వర్గీయులను బెదిరించారు భాస్కర్ వర్గీయులు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెద్దదయింది. భాస్కర్ అనుచరులు కట్టెలు, రాళ్లతో శేఖర్ వర్గీయుల పై దాడి చేశారు. శేఖర్ వర్గీయులు ప్రతిఘటించారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన రెహమాన్, మద్దిలేటి అనే ఇద్దరు శేఖర్ వర్గీయులు భాస్కర్, అతని వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో పార్టీలోని ముఖ్య నాయకులు మాత్రమే కాదు గ్రామాల్లోని చోటామోటా లీడర్లు కూడా ఆధిపత్యం కోసం పోరాటం సాగిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది.