శ్రీశైలంలో కలకలం రేపిన అన్యమత పార్శిల్... ఇంతకీ అందులో ఏముంది...
హిందూ దేవాలయాలపై దాడులు... విగ్రహాల ధ్వంసంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో శ్రీశైలంలో ఓ అన్యమత పార్శిల్ కలకలం రేపింది. ఆలయానికి సమీపంలో ఉన్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఇంటి చిరునామాకు ఈ పార్శిల్ వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే... శ్రీశైలం ఆలయంలో పనిచేసే ఓ వ్యక్తి ఆలయానికి సమీపంలోని ఎస్సీ కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గురువారం అతని ఇంటి చిరునామాతో ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక ఆర్టీసీ బస్టాండ్కు ఓ పార్శిల్ వచ్చింది. దానిపై క్రిస్టియన్ సంస్థ గుర్తులు ఉండటంతో స్థానికులు దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఆ పార్శిల్ను స్వాధీనం చేసుకుని చిరునామాను పరిశీలించారు. ఆలయంలో పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఆ పార్శిల్ వచ్చినట్లు గుర్తించారు. ఆపై ఆ ఉద్యోగిని పోలీస్ స్టేషన్కు పిలిపించి దానిపై ఆరా తీశారు. ఆ పార్శిల్ను ఓపెన్ చేసి చూడగా క్రిస్టియన్ సంస్థ ఆ కుటుంబానికి నెలవారీ నిత్యావసరాలను పంపించినట్లు గుర్తించారు. శ్రీశైలంలో అన్యమత ప్రచారాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా,ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలోని కొల్లూరులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతకుముందు కర్నూలు జిల్లా పత్తికొండలోనూ ఓ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.అలాగే కృష్ణాజిల్లాలోని మక్కపేటలో ఉన్న కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహంపై కూడా పాక్షికంగా దాడి చేశారు. ఇలా హిందూ ఆలయాలు,విగ్రహాలపై వరుస దాడులతో బీజేపీ,భజరంగ్దళ్ కార్యకర్తలు ప్రభుత్వంపై కన్నెర చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భజరంగ్దళ్ కార్యకర్తలు ఇటీవల హైదరాబాద్ లోటస్పాండ్లోని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.