పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్: సొంత పార్టీ నేతలే కారణమంటూ ముందే హెచ్చరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
కర్నూలు: మొన్నటికి మొన్న- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా.. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఓ కీలక అంశాన్ని బహరింగ సభలో, ఆయన సమక్షంలోనే ప్రస్తావించారు. అదే ప్రశ్నా పత్రాల లీకేజీ. కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నా పత్రాలను లీక్ చేస్తున్నారని, కోట్ల రూపాయలకు కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యూషన్ అకాడమీలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్దిరోజుల వ్యవధిలోనే పదో తరగతి ప్రశ్నా పత్రం ఒకటి లీక్ అయింది. వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. పరీక్ష ఆరంభమైన అరగంటలోనే సంబంధిత ప్రశ్నాపత్రం వాట్సప్ విపరీతంగా షేర్ అయింది.
ఇంట్రెస్టింగ్ : కాంగ్రెస్ కనీస ఆదాయం పథకం నుంచి భత్యంగా భార్యకు ఇస్తాడట
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిగా భావించే పదో తరగతి పరీక్షల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనడానికి ఇదే నిదర్శనం. అధికారంలో ఉన్న పార్టీని అడ్డుపెట్టుకుని కొందరు టీడీపీ నాయకులు విద్యాశాఖ సిబ్బందితో మిలాఖాత్ అయ్యారని, వారి సహయాంతో ముందే ప్రశ్నాపత్రాలను బయటికి తెప్పించుకుని, కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని పాలకొండ్రాయుడు ఇదివరకే చంద్రబాబు సమక్షంలోనే ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మార్గాల్లో హల్ చల్ చేశాయి.
ఆరోపణలను నిజం చేస్తూ.. లీక్
పాలకొండ్రాయుడు చేసిన ఆరోపణలు నిజమే అనిపించేలా కర్నూలు జిల్లాలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లా విద్యాధికారులు దీనిని గుర్తించి అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వీరి ఆదేశాలమేరకు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శనివారం సోషల్ పేపర్-2ను నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని చరవాణిలో ఫొటో తీసి వాట్సాప్లో బయటకు పంపించారు.
పరీక్షా కేంద్రంలో విద్యార్థుల చేతికి ప్రశ్నాపత్రాన్ని అందించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాట్సప్ లో షేర్ కావడం అధికారులను ఆందోళనకు గురి చేసింది. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందే స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫొటో తీసి, వాట్సప్ లో షేర్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ డీఈవో తాహిరా సుల్తానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు..ఏ ఫోన్నంబర్ల నుంచి ప్రశ్నపత్రాలు బయటకు వచ్చాయన్న దానిపై విచారణ చేపట్టారు.
చేతిలో స్మార్ట్ ఫోన్.. ఒక్క ఫొటోతో పేపర్ లీక్..
గతంలోనూ పేపర్ల లీకేజీకి సంబంధించిన కొన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ.. ఆ ఘటనలపై ప్రభుత్వం గానీ, అధికారులు గానీ పెద్దగా దృష్టి సారించలేదు. చూసీ చూడనట్టు వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. స్మార్ట్ ఫోన్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తరువాత.. పేపర్ల లీకేజీ వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రశ్నాపత్రాలను ఫొటోలు తీసి, తమకు బాగా కావాల్సిన లేదా, ముడుపులు అప్పగించిన వారికి వాట్సప్ ద్వారా షేర్ చేయడం సులభతరమైంది.
దీన్ని అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నాయకులు కొందరు పేపర్లను లీక్ చేయడం ద్వారా కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్నారని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే స్వయంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో బహిరంగ సభలో ప్రస్తావించారు. అయినప్పటికీ- వాటికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలను తీసుకోలేదు. దీనితో పేపర్ల లీకేజీ వ్యవహారం ఓ ప్రహసనంగా మారిపోయింది. వార్షిక పరీక్షల సమయంలో పేపర్లను లీక్ చేయడం కొందరు టీడీపీ నాయకులు ఆనవాయితీగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు.
వణికి పోయిన ప్రభుత్వాలు
ఓ ప్రశ్నాపత్రం లీక్ అయితే.. ప్రభుత్వాలు వణికి పోయిన సందర్భాలు ఉన్నాయి. వాటికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత శాఖ మంత్రి సైతం రాజీనామా చేసిన సంఘటనలు ఉన్నాయి. 1990వ దశకంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రశ్నాపత్రం లీక్ కాగా, సంబంధిత శాఖ మంత్రిగా పనిచేసిన దివంగత గాలి ముద్దు కృష్ణమ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కాలం మారింది. స్మార్ట్ ఫోన్లు విస్తారంగా వినియోగంలోకి రావడంతో.. ప్రశ్నాపత్రాలను సులువుగా లీక్ చేస్తున్నారు. దీనిపై నిఘా ఉంచి, లీకేజీని అరికట్టాల్సిన ప్రభుత్వం..కనీసం కట్టుదిట్టంగా పరీక్షలను నిర్వహించలేక చేతులెత్తేసిందని సామాన్యులు విమర్శిస్తున్నారు. తొలిసారిగా పేపర్ లీక్ అయినప్పుడే కఠిన చర్యలను తీసుకుని ఉంటే.. ఇలాంటి సంఘటనలను పునావృతం అయ్యేవి కాదని అంటున్నారు.