వీడియో: నంద్యాల వీధుల్లో మొసలి: కుందూనది వరద ప్రవాహం నుంచి వచ్చిన అనుకోని అతిథి!
Recommended Video
కర్నూలు: మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు జిల్లాలోని అన్ని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నంద్యాల గుండా ప్రవహించే శ్యామ్ కాలువ, శివార్లలోని కుందూ నది వరద ప్రవాహాన్ని సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు తోడు..పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి కృష్ణా జలాలను వదలడంతో కుందూనది పరవళ్లు తొక్కుతోంది. కుందూనదికి ఆనుకుని ఉన్న సలీమ్ నగర్, ప్రథమ నంది ఆలయం, పద్మావతి రోడ్డు, నంద్యాల-ఆత్మకూరు రోడ్డు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు కుందూనది ఉప్పొంగడంతో ఆయా ప్రాంతాల్లో వరదనీరు ప్రవేశించింది. ఈ వరద ప్రవాహం నుంచి ఓ మొసలి సైతం కొట్టుకుని వచ్చింది. సలీమ్ నగర్ వీధుల్లో హల్ చల్ చేసింది.
సలీమ్ నగర్ వీధుల్లో సుమారు మోకాలి లోతు వరకు నిలిచిన నీటిలో తిరుగాడుతూ కనిపించింది. మొదట దీన్ని చేపలా భావించారట స్థానికులు. మొసలిగా తేలడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వీధుల్లో నడిచే సాహసం చేయలేదు. స్థానికుల్లో ఒకరు ఓ తాడు సహాయంతో దాన్ని బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మొసలి కొట్టుకుని వచ్చిన విషయాన్ని అటవీశాఖ డివిజనల్ కార్యాలయానికి ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే సలీమ్ నగర్ కు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది మొసలిని బంధించారు. దాన్ని శ్రీశైలం రిజర్వాయర్ లో వదిలివేస్తామని తెలిపారు.
ఇదిలావుండగా.. ప్రస్తుతం కుందూనది ఇదివరకు ఎప్పుడూ లేనంత వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. నెలరోజుల నుంచీ పరవళ్లు తొక్కుతోంది ఈ కుముద్వతి నది. శ్రీశైలం రిజర్వాయర్ కు తొలిసారిగా గేట్లు తెరిచినప్పటి నుంచీ కుందూనదిలో అనూహ్యంగా వరద తీవ్రత కొనసాగుతోంది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి కృష్ణా వరద జలాలను రాయలసీమకు వదిలి వేయడంతో ఆ నీరు కూడా కుందూలోకి ప్రవహిస్తున్నాయి. తాజాగా సోమవారం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల కుందూనది మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీర ప్రాంతాలను ముంచెత్తుతోంది. నంద్యాల సహా కడప జిల్లాలోని వెల్లాల పుణ్యక్షేత్రం, చాపాడు వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంది.