ఆరుబయట క్లాసులు.. చీరల మధ్య పాఠాలు: లెక్కల మాస్టారు ఐడియా: కర్నూలు జిల్లాలో కరోనా పీడ
కర్నూలు: రాష్ట్రంలో ఒకవంక కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఇదివరకట్లా 10 వేలకు మించిన నమోదు కానప్పటికీ.. దాని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. రోజూ మూడువేలకు కాస్త అటు, ఇటుగా కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటోన్న వారి సంఖ్య కూడా వేలల్లో ఉంటోంది. ఫలితంగా- యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అన్లాక్ తరువాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా అంటే జనం పెద్దగా భయపడట్లేదు. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. సహజీవనానికి అలవాటు పడ్డారు.
వెంటాడుతోన్న కరోనా భయం..
ఈ పరిణామాల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తెరచుకున్నాయి. 9, 10వ తరగతి విద్యార్థులకు బోధన కొనసాగుతోంది. పాఠశాలలను పునఃప్రారంభించిన తరువాత పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. చిత్తూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాఠశాలలను తెరిచిన తరువాత కేసులు పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా వైరస్ భయం విద్యార్థులు, ఉపాధ్యాయులను పీడిస్తోంది.
లెక్కల మాస్టారు న్యూ ఐడియా..
ఈ భయంతోనే కర్నూలు జిల్లాలో ఓ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించారు. నాలుగు గోడల మధ్య పాఠాలను బోధించట్లేదు. పాఠశాల ఆవరణలో ఆరుబయట ఆయన తరగతులను నిర్వహిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడి పేరు ఎస్ అబ్దుల్ రకీబ్. మ్యాథమేటిక్స్ టీచర్. కర్నూలు జిల్లాలోని గడివేముల జెడ్పీ హైస్కూల్లో ఆయన పనిచేస్తున్నారు. 390 మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న హైస్కూల్ అది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలల్లో విద్యాబోధన సాగుతోంది.
చీరల మధ్య పాఠాలు..
కరోనా వైరస్ సోకుతుందనే భయం వల్ల పాఠశాలలకు విద్యార్థులెవరూ రావట్లేదు. భౌతికదూరం పాటించడం కష్టతరమౌతుందని, తరగతి గదిలో ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవనే కారణంతో వారు గైర్హాజర్ అవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి అబ్దుల్ రకీబ్.. ఆరుబయట, చెట్ల కింద చీరల మధ్య పాఠాలను బోధించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే దాన్ని అమలు చేశారు. తోటి ఉపాధ్యాయుడు నూరుల్లా నుంచి పాత చీరలను తెప్పించారు. చెట్లకు కట్టి, వాటి మధ్య పాఠాలను బోధిస్తున్నారు. ఔట్డోర్ కావడం వల్ల భౌతికదూరాన్ని పాటించడానికి వీలు ఉంటుందని అబ్దుల్ రకీబ్ చెబుతున్నారు. ఆయన చేసిన ఈ ప్రయత్నంపై మిశ్రమ స్పందన వస్తోంది.
కర్నూలు జిల్లాలో తగ్గుతోన్న కరోనా తీవ్రత..
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ రోజవారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గురువారం నాడు అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఈ జిల్లాలో కొత్తగా నమోదైన కేసులు 38 మాత్రమే. యాక్టివ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదు అయ్యాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో యాక్టివ్ ఉన్న కరోనా కేసులు 296. ఈ జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 59,638 కాగా ఇందులో 58,860 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జి అయ్యారు. 482 మంది మృతిచెందారు.