YSR Congress Party MLA: యాగంటి టు శ్రీశైలం పాదయాత్ర: మొక్కు తీర్చుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే..!
కర్నూలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మొక్కు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన పాదయాత్ర చేపట్టారు. కర్నూలు జిల్లాలోని రెండు ప్రఖ్యాత శైవ క్షేత్రాల మధ్య ఈ పాదయాత్రను ప్రారంభించారు. యాగంటి నుంచి శ్రీశైలం ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి యాగంటికి చేరుకున్నారు. యాగంటి ఉమా మహేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రాంగణం నుంచి పాదయాత్ర ఆరంభించారు.
వైఎస్ జగన్ సంచలనం: ఇసుక, మద్యం రవాణా బాధ్యత నిరుద్యోగ యువతకు: ఓసీలు అనర్హులు!
గోరుకల్లు, రిజర్వాయర్ నిండాలని మొక్కులు..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాది భారీ వానలు కురిస్తే.. యాగంటి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తానని ఆయన మొక్కుకున్నారు. భారీ వర్షాలు కురిసి.. జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే గోరుకల్లు ప్రాజెక్టు, శ్రీశైలం రిజర్వాయర్ నిండాలని ఆయన సంకల్పం తీసుకున్నారు. కారణేలైమనప్పటికీ.. ఈ సీజన్ లో రాష్ట్రంలో ఏ స్థాయిలో వర్షాలు కురిశాయో తెలిసిందే. గోరుకల్లు ప్రాజెక్టు, శ్రీశైలం రిజర్వాయర్ మాత్రమే కాదు అవుకు, సుంకేసుల సహా రాయలసీమలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.
కరవు తీరేలా వానలు..
ఏనాడూ నిండని పెన్నా అహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మొదలుకుని మిడ్ పెన్నార్, చాగల్లు, పెండేకళ్లు, గండికోట, మైలవరం వంటి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. వాటి గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుకోవాల్సి వచ్చింది. ఇక శ్రీశైలం ఏ స్థాయిలో వరద నీటి ప్రవాహానికి గురైందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక వర్షాకాలం సీజన్ లో ఏడుసార్లు అంత భారీ నీటి ప్రాజెక్టు గేట్లను ఎత్తడమంటే మాటలు కాదు. ఆశించిన దానికి మించి, అంచనాలకు మించి వర్షాలు కురిశాయి. ఫలితంగా కనీసం రెండేళ్ల వరకు రాయలసీమలో కరవు జాడలో ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
మొక్కు కోసం పాదయాత్ర..
ఈ పరిస్థితుల మధ్య కాటసాని రాంభూపాల్ రెడ్డి తన పాదయాత్రను ఆరంభించారు. వర్షాలు సమృద్ధిగా కురిశాయని, అంచనాలకు మించిన వర్షపాతం నమోందైందని, అందుకే తన మొక్కును తీర్చుకుంటున్నానని ఆయన చెప్పారు. రెండురోజుల్లోగా శ్రీశైలానికి చేరుకుంటానని అన్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తరువాత శ్రీశైలం రిజర్వాయర్, గోరుకల్లు ప్రాజెక్టుల్లో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేస్తానని చెప్పారు. కాటసాని కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాలుపంచుకుంటున్నారు.