వీడియో: శ్రీశైలంలో అన్యమత ప్రచారం?: వాహనంపై వైఎస్ జగన్ ఫొటో
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి అన్యమత ప్రచారానికి సంబంధించిన వివాదాలు చెలరేగాయి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన వాణిజ్య భవన సముదాయంలో హిందూయేతర వ్యక్తులకు దుకాణాలను కేటాయించిన ఘటన రగల్చిన వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది. దాని వెనుకే ఇంకో రచ్చ మొదలైంది. శ్రీశైలం కొండపై అన్యమతానికి చెందిన ఓ ప్రచార వాహనం చక్కర్లు కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం ఓ అన్నదాన సత్రం ముందు రోడ్డు పక్కన ఈ వాహనాన్ని నిలిపి ఉంచిన దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వాహనంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలను అతికించారు. వాహనాన్ని నిలిపి ఉంచిన ప్రదేశం దేవస్థానం పరిధిలోకి వస్తుందా? రాదా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
రెండురోజుల కిందట ఈ వీడియోను చిత్రీకరించినట్లుగా చెబుతున్నారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ కు చెందిన శివశక్తి అనే ధార్మిక ప్రచార సంస్థ దీనిపై స్పందించింది. ఈ సంస్థ ప్రతినిధి రామినేని వెంకట్రామయ్య ఈ ఘటనపై శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈఓ విచారణకు ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానానికి చెందిన శ్రీలలితాంబికా అమ్మవారి వాణిజ్య భవన సముదాయంలో ముస్లింలకు 30 శాతం దుకాణాలను కేటాయించిన విషయం తెలిసిందే. అప్పటి కార్యనిర్వహణాధికారి శ్రీరామచంద్ర మూర్తి నేతృత్వంలో అధికారికంగా వేలంపాటలను నిర్వహించి మరీ.. ముస్లింలకు వాణిజ్య దుకాణాలను కేటాయించారు.
దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో ప్రభుత్వం స్పందించింది. వేలంపాటలను రద్దు చేస్తూ దేవాదాయ శాఖ రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామచంద్ర మూర్తిపై బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్తగా కేఎస్ రామారావును నియమించింది. ఆయన హయాంలోనూ అన్యమత ప్రచారం చోటు చేసుకున్నట్లు వార్తలు రావడం, వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.
వీడియో: శ్రీశైలంలో అన్యమత ప్రచారం?: వాహనంపై వైఎస్ జగన్ ఫొటో#Srisailam #Kurnool #AndhraPradesh pic.twitter.com/97rN6cQxHS
— Oneindia Telugu (@oneindiatelugu) September 1, 2019
హైందవ దేవాలయాలు, ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థల్లో హిందూ ఉద్యోగులు మాత్రమే ఉండాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హిందూయేతర ఉద్యోగులు వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ కు రిపోర్ట్ చేయాలంటూ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్దిరోజుల్లోనే అన్యమత ప్రచారానికి చెందిన వాహనం శ్రీశైలంలో చక్కర్లు కొట్టడం వివాదాన్ని రేకెత్తిస్తోంది.