దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి స్థానంలో అభ్యర్థిని ఖరారు చేసిన వైఎస్ జగన్
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నేరుగా అవుకు బయలుదేరి వెళ్లారు. దివంగత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. భార్య, కుమారులు, కుమార్తెలను కలిశారు.
వారికి తన సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. చల్లా కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చల్లా భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ను జిల్లాకు చెందిన కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, నందికొట్కూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, కలెక్టర్ జీ వీరపాండ్యన్, ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి, పలువురు వై స్వాగతం పలికారు.
అనంతరం వైఎస్ జగన్ విమానాశ్రయం నుంచి నేరుగా అవుకు బయలుదేరి వెళ్లారు. చల్లా రామకృష్ణా రెడ్డి ఇంటికి చేరుకున్నారు. చల్లా చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం ఆయన భార్యా, కుమారులు, కుమార్తెలను పరామర్శించారు. చల్లా కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుమారుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
చల్లా మరణం వల్ల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించబోయే ఉప ఎన్నికలో భగీరథ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా నిలబెడతామని భరోసా ఇచ్చారు. ఈ నెల 1వ తేదీన తెల్లవారు జామున చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.