బుట్టా పై బెట్టు..! ప్రచారానికి ఒద్దన్న ఎమ్మిగనూరు అభ్యర్థి..! ఎదురు తిరిగిన చేనేత కార్మికులు..!!
కర్నూలు/హైదదరాబాద్ : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఏపి రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రత్యర్థుల పైన వ్యూహాత్మంగా అడుగులు వేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు నేతలు. అభ్యర్ధులు కూడా తమ తమ గెలుపుకోసం మండే ఎండను కూడా లెక్క చేయడం లేదు. ఇక ప్రతికూల సరిస్థితులు ఉన్న సొంత పార్టీ నేతలను కూడా అభ్యర్థులు విడిచిపెట్టడం లేదు, ప్రజల్లో అంతగా ప్రజాధరణ లేని నాయకులు ప్రచారానికి వస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, అలాంటి వివాదాస్పద నేతలను ప్రచారానికి ససేమిరా అంటున్నారు పార్టీ అభ్యర్థులు.
నీతి లేని నేతలకు నోటాతో బుద్ది చెప్పండి..! ఖమ్మంలో ఓ వృద్ధుడి వినూత్న ప్రచారం..!!
బుట్టా రేణుకను ప్రచారానికి వద్దన్న అభ్యర్థి..! ఎందుకో చెప్పాలని ఎదురు తిరిగిన చేనేత కార్మికులు..!!
ఇక ఇలాంటి సంఘటనే ఎంపి బుట్టా రేణుకకు ఎదురైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎంపీ బుట్టా రేణుక, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గంలో రేణుక ఎన్నికల ప్రచారం చేయకూడదని చెన్నకేశవరెడ్డి హుకుం జారీ చేశారు. ఆయన తీరుపై బుట్టా అభిమానులు, కుర్ణి చేనేత కార్మికులు భగ్గుమంటున్నారు. రేణుకకు పెద్ద యెత్తున సంఘీభావం తెలుపుతున్నారు.
బుట్టా రేణుకను అవమానిస్తే ఊరుకోమన్న చేనేత కార్మికులు..! ప్రచారం చేయొద్దన్న ఎమ్మెల్యే అభ్యర్థి..!!
తమ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ప్రచారానికి రావొద్దని అవమానించిన కేశవరెడ్డిని ఓడించి తీరుతామని శపథం చేశారు. ఎమ్మిగనూరులో 90 వేలకుపైగా చేనేత ఓటర్లు ఉన్నారు. ఆదివారం రాత్రి అక్కడి మాచాని సోమప్ప మెమోరియల్ హాలులో చేనేత, బీసీ కులాల ఆత్మీయ సమావేశం జరిగింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్కుమార్, చెన్నకేశవరెడ్డి హాజరయ్యారు. కేశవరెడ్డి మాట్లాడుతుండగా బుట్టా అభిమానులు అడ్డుతగిలారు.
ఐదేళ్లు ఎంపీగా ఒక్క పని చేయలేదన్న కేశవరెడ్డి..! రెచ్చిపోయిన బుట్టా వర్గం..!!
రేణుకను ప్రచారానికి ఎందుకు రావొద్దన్నారని నిలదీశారు. ఆయన వారికి సర్దిచెప్పకుండా మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆమె ఎంపీగా గెలిచాక ఐదేళ్లలో ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, నాగులదిన్నె గ్రామాన్ని దత్తత తీసుకుని గజం సిమెంటు రోడ్డు కూడా వేయలేదని, ఆమెను ఎందుకు ప్రచారానికి పిలవాలని ఎదురుదాడికి దిగారు.
సొంతపార్టీలోనే కుమ్ములాటలు..! ఎమ్మిగనూరు వైసిపిలో విచిత్ర పరిస్థితులు..!!
దీంతో ఆగ్రహించిన చేనేతలు, బీసీలు.. అగ్రకుల అహంకారంతోనే కేశవరెడ్డి ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఎదురుదాడికి దిగి కన్నీరు పెట్టిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో కేశవరెడ్డి ఓటమే లక్ష్యంగా పని చేస్తామని చేనేతలు నినాదాలు చేశారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించారు. ఎమ్మిగనూరులో కేశవరెడ్డికి ప్రత్యామ్నాయ నాయకురాలిగా ఎదుగుతారన్న భయంతోనే ఆయన ఆమె ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని.. తమ సత్తా ఏమిటో చూపిస్తామని స్పష్టం చేస్తున్నారు.