మీరు నాతో పాటు అమరావతికి రండి- చంద్రబాబుతో నేనే ఆ మాట చెప్పిస్తా: భూమా అఖిల ప్రియ..!!
కర్నూలు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మూడు రాజధానుల ఏర్పాటు కోసం చకచకా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు ఇటీవలే ఇచ్చిన మధ్యంతర స్టేతో ఇప్పటివరకు ఉన్న న్యాయపరమైన చిక్కుముడులన్నీ వీడిపోతున్నట్లుగా భావిస్తోన వైసీపీ- అధికార వికేంద్రీకరణ దిశగా తక్షణ చర్యలను తీసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా మూడు రాజధానులకు అవసరమైన కొత్త బిల్లు రూపకల్పనపై కసరత్తు మరింత ముమ్మరం చేసింది.
మరింత వేగంగా..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడంలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ఊపందుకోనుంది. కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడానికి, అధికారాన్ని వికేంద్రీకరించడానికి నాన్ పొలిటికల్ జేఏసీ ఇప్పటికే మద్దతు పలికింది. న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలులో సోమవారం నిర్వహించిన సభ ఘన విజయం సాధించిన నేపథ్యంలో- ఆయా చర్యలన్నీ మరింత వేగం పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ అండ..
రాయలసీమ గర్జన పేరుతో కర్నూలు ఎస్టీబీసీ కళాశాల గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభను వైసీపీ నాయకులు దగ్గరుండి మరీ విజయవంతం చేశారు. మంత్రులు గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఉషా శ్రీచరణ్, ఎనిమిది జిల్లాల వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ గళమెత్తారు.
భారీగా సభ..
వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోన్నారని, ఇందులో భాగంగానే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనికి చంద్రబాబు అడ్డు పడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో తన సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే బాగుపడాలని చంద్రబాబు కోరుకుంటోన్నారని ఆరోపించారు.
రెండు సభలు గ్రాండ్ సక్సెస్తో..
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ- తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా కనిపిస్తోంది. రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తోన్న టీడీపీ వైఖరిలో.. ఈ రాయలసీమ గర్జన సభ తరువాత మార్పు వచ్చిందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. కార్యనిర్వాహక రాజధాని కోసం ఇదివరకు విశాఖపట్నంలో, న్యాయ రాజధానిగా ఇప్పుడు కర్నూలులో సభలు విజయవంతం కావడం టీడీపీ ఆందోళనకు గురి చేస్తోంది.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు..
ఈ పరిణామాల మధ్య టీడీపీ- ఓ పాత వీడియోను సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తోంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోసం ఇదివరకు న్యాయవాదుల జేఏసీ నిర్వహించిన ఆందోళనల సమయంలో- మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో అది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలంగా ఉన్నారని ఆమె అప్పట్లో స్పష్టం చేశారు. ఆందోళనకారులు తనవెంట అమరావతికి వస్తే చంద్రబాబుతో తానే ఆ మాటను చెప్పిస్తానంటూ పేర్కొన్నారు.
ఇప్పుడు వెలుగులోకి..
రాయలసీమ గర్జన గ్రాండ్ సక్సెస్ అయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఇప్పుడు వెలుగులోకి తీసుకుని రావడం, అది కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకే చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో టీడీపీ ఆత్మరక్షణలో పడిందనేది దీనితో స్పష్టమైందనే అభిప్రాయాలు ఉన్నాయి.