ఆళ్లగడ్డలో టెన్షన్: భూమా అనుచరులు మిస్సింగ్.. గంగుల కుటుంబంపై ఆరోపణలు
Recommended Video
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొన్ని చోట్ల ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు కూడా దిగారు.
ఆళ్లగడ్డలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. భూమా కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆళ్లగడ్డలో ఈ సారి వైసీపీ అభ్యర్థిగా గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి బరిలో దిగారు. అయితే ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఆళ్లగడ్డలో పలు చోట్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తమ మనుషులు ఇద్దరిని గంగుల వర్గీయులు కిడ్నాప్ చేశారని భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఆరోపించారు. వారిని వైసీపీ వర్గీయులు తమ వాహనాల్లో వేసుకుని తీసుకెళ్లారని చెప్పారు. గొడవకు దిగడం తమకు ఎంతో సమయం పట్టదని అయితే సహనంతో ఉన్నట్లు జగత్ విఖ్యాత్ రెడ్డి చెప్పారు. కిడ్నాప్కు గురైన తమ మనుషులు ఫోన్ చేసి కాపాడాల్సిందిగా కేకలు పెడుతున్నారని... అక్కడికి వెళ్లిన పోలీసులు మాత్రం తమ మనుషులు ఎవరూ లేరని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగత్ విఖ్యాత్ రెడ్డి
వైసీపీ వర్గీయులు దారుణానికి పాల్పడుతున్నారని భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికా రెడ్డి ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా తమపైకి రాళ్లు రువ్వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్లలో కర్రలు కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారని మౌనికారెడ్డి ఆరోపించారు. తమ కారును కూడా ధ్వంసం చేసినట్లు ఆమె చెప్పారు. ఓటింగ్ ప్రశాంతంగా జరగాలని తాము కోరుకుంటుంటే ఓటమి భయంతో గంగుల వర్గీయులు ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారని మౌనికా రెడ్డి మండిపడ్డారు. అహోబిలంకు తాను వెళితే అక్కడ తనపై దాడి చేసేందుకు వైసీపీ నాయకులు యత్నించారని మండిపడ్డారు. తమకే భద్రత లేకుంటే ఇక సామాన్య ఓటరు పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.
కిడ్నాప్ చేసిన తమ అనుచరులను ఇద్దరిని అప్పగించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెబుతూ రోడ్డుపైనే వాహనాలు నిలిపి ధర్నాకు దిగారు. పోలీసులు పట్టించుకోకుంటే గంగుల ఇంటిముందు కుటుంబ సభ్యులందరం ధర్నాకు దిగుతామని జగత్ విఖ్యాత్ రెడ్డి మౌనికా రెడ్డిలు హెచ్చరించారు.